Bengal Bandh Updates: ఆర్‌జీ కర్ హాస్పిటల్ ఘటన బెంగాల్ రాజకీయాల్లో వేడి పుట్టించింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని తీవ్రంగా ఆరోపిస్తోంది బీజేపీ. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ కేసుని సీబీఐ విచారిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా పురోగతి లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ 12 గంటల బెంగాల్ బంద్‌కి పిలుపునిచ్చింది. ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. "Nabbana" పేరుతో సెక్రటేరియట్ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. అయితే..ఈ నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఇదంతా పెద్ద దుమారమే రేపింది. పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ...బీజేపీ 12 గంటల బంద్‌కి పిలుపునిచ్చింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.






TMC పార్టీ కార్యకర్తలు తన కార్‌పై రాళ్లు రువ్వారంటూ బీజేపీ నేత ఒకరు ఆరోపించడం వల్ల గొడవ మరీ ఉద్దృతమైంది. ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ప్రభుత్వం మాత్రం బీజేపీ బంద్‌ని పట్టించుకోవద్దని తేల్చి చెప్పింది. ఎవరూ దుకాణాలు మూసేయాల్సిన పని లేదని స్పష్టం చేసింది. కోల్‌కతాలో బంద్ ప్రభావం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. షాప్స్ తెరిచే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలు కూడా బంద్ కాలేదు. ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. అయితే..ఎక్కడా పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. ఓ చోట మెట్రో స్టేషన్‌ గేట్‌ని బలవంతంగా మూసేస్తుండగా బీజేపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్‌ డ్రైవర్‌లు హెల్మెట్‌లు పెట్టుకుని బస్‌ నడుపుతున్నారు. దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్నీ తెరిచే ఉంటాయని మమతా సర్కార్‌ ప్రకటించింది. 






ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. అప్పటి నుంచి ఈ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో చాలా మంది పెద్ద వాళ్ల హస్తం ఉందని, ప్రభుత్వం వాళ్లందరినీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మమతా సర్కార్ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తోంది. పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తోంది.