Ram Mandir Opening: అయోధ్య రాముడికి కొత్త బట్టలు కుట్టించారు. జనవరి 22న ఉత్సవం (Ramlala Pran Pratishtha) జరిగే రోజునే బాల రాముడికి ఆ దుస్తులు అందించనున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఓ జెండానీ తయారు చేయించినట్టు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన వెంటనే బాల రాముడి విగ్రహానికి ఈ కొత్త దుస్తులు వేయనున్నారు. రామ దళ్ అయోధ్య ప్రెసిడెంట్ కల్కీ రామ్‌ దాస్ మహారాజ్‌ ఈ దుస్తుల్ని రాముడికి సమర్పించనున్నారు. 


"అయోధ్య రాముడి కోసం ప్రత్యేకంగా దుస్తులు కుట్టించారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన వెంటనే ఆ విగ్రహానికి వీటిని తొడుగుతాం. రామ దళ్ అయోధ్య అధ్యక్షుడు కల్కిరామ్‌ దాస్‌ ఈ దుస్తుల్ని తయారు చేయించారు. దీంతో పాటు ఓ జెండా కూడా కుట్టించారు. ఈ రెండింటినీ జనవరి 22న ఆయన రాముడికి సమర్పిస్తారు"


- ఆచార్య సత్యేంద్ర దాస్, అయోధ్య ఆలయ ప్రధాన పూజారి


భక్తుల కానుకలు..


ఆ రాముడి ఆశీర్వాదం తనపై ఉండడం వల్లే ఈ అదృష్టం కలిగిందని కల్కి రామ్‌ దాస్ మహారాజ్‌ వెల్లడించారు. ప్రధాని మోదీ చొరవ చూపించకపోయుంటే ఇదంతా జరిగేది కాదని ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే భక్తులు కొందరు అయోధ్య రాముడికి చాలా కానుకలు అందించారు. వెండి శంఖం, పిల్లనగ్రోవితో పాటు మరి కొన్ని నగలు ఇచ్చారు. వాటిని ఆచార్య సత్యేంద్ర దాస్ స్వీకరించారు. ఈ నెల 14 నుంచే అయోధ్యలో అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు మొదలయ్యాయి. ఈ నేల 22న ప్రాణప్రతిష్ఠ జరిగేంత వరకూ ఇవి కొనసాగనున్నాయి. 


అయోధ్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు (Ayodhya Ram Manidr Opening) ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశమంతా ఈ మహత్తర కార్యక్రమం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే యూపీలోని గోర్‌ఖప్‌రూలో ఉన్న గీతా ప్రెస్‌ ఆసక్తికర విషయం వెల్లడించింది. అయోధ్య ఉత్సవం సందర్భంగా రామ్‌చరిత్‌ మానస్ (Ramcharitmanas) పుస్తకాలకు డిమాండ్ అమాంతం పెరిగిందని తెలిపింది. 50 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో గిరాకీ పెరిగిందని గీతా ప్రెస్‌ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాముడి ప్రాణప్రతిష్ఠ (Ram Mandir) ముహూర్తం ప్రకటించినప్పటి నుంచే రామ్‌చరిత్‌మానస్ పుస్తకాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. గతంలో నెలకు 75 వేల కాపీలు ప్రింట్ చేస్తే..ఇప్పుడు దాదాపు లక్ష కాపీలు ప్రింట్ చేస్తోంది గీతా ప్రెస్. అంటే ఏ మేర గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా వేలాది మంది హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిరాకరించింది. 


Also Read: భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయేమో, ఎర్ర సముద్రం సంక్షోభంపై WEF చీఫ్ కీలక వ్యాఖ్యలు