Artificial Jyoti At Ram Janmabhoomi Temple In Ayodhya Sparks Debate: అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించిన కృత్రిమ జ్యోతి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకముందు, తాత్కాలికంగా విగ్రహాన్ని ఉంచిన చోట శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కృత్రిమ దీపాన్ని ఏర్పాటు చేసింది. వేద మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్తమైన పూజల అనంతరం దీనిని ప్రతిష్ఠించినట్లు ట్రస్ట్ ఏప్రిల్ 11న అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ జ్యోతి చూడటానికి అసలైన దీపంలా కాకుండా ఎలక్ట్రానిక్ పరికరంలా కనిపిస్తుండటంతో భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆలయ ట్రస్ట్ నిర్ణయంపై మండిపడుతున్నారు. సంప్రదాయబద్ధంగా వెలిగించే అఖండ జ్యోతికి బదులుగా, కృత్రిమ కాంతిని ఇచ్చే పరికరాన్ని పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొందరు వినియోగదారులు దీనిని చైనా బొమ్మ తో పోలుస్తూ, పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఆధునిక పోకడలు అవసరమా అని అసహనం వ్యక్తం చేశారు. అఖండ జ్యోతిని వెలిగించే సంప్రదాయం అంతరించిపోయిందా.. అని ప్రశ్నిస్తూ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
సాధారణంగా హిందూ సంప్రదాయంలో దీపం అనేది నెయ్యి లేదా నూనెతో వెలిగించే అగ్ని స్వరూపం. కానీ, ఇక్కడ ఏర్పాటు చేసిన జ్యోతి ప్లాస్టిక్ , ఇతర లోహాలతో చేసిన ఎలక్ట్రానిక్ లైటులా ఉండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇంతటి భారీ బడ్జెట్తో నిర్మించిన ఆలయంలో ఒక అఖండ జ్యోతిని నిరంతరం వెలిగించడం ట్రస్ట్కు అంత కష్టమైన పనా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఈ వివాదంపై ఆలయ అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో స్పందించలేదు. కేవలం అది ఒక సంకేత రూపమని, శాస్త్రోక్తంగానే ప్రతిష్ఠించామని ప్రాథమికంగా తెలిపారు. అయితే, ఆధునిక సాంకేతికతను ధార్మిక సంప్రదాయాలతో ముడిపెట్టడంపై భక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ గర్భాలయంలో సంప్రదాయ దీపాన్నే ఉంచాలని మెజారిటీ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
