ఏపీ సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ కి మంత్రులు కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత జగన్ బ్యాంక్ నూతన లోగో , పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. కొత్త బ్రాండ్ సంకల్ప్ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
వీటితో పాటు 13 డీసీసీబీలకు డివిడెంట్ల పంపిణీతో పాటు బ్యాంక్ విజన్ డాక్యుమెంట్స్ ను జగన్ ఆవిష్కరించారు. రాష్ట్ర సహకార రంగం చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందని జగన్ అన్నారు. ఆప్కాబ్ 60 ఏళ్ల ప్రయాణంలో ఆప్కాబ్ రైతులకు అండగా నిలబడిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్కాబ్ ను నిలబెట్టడంలో కీలక పాత్ర వహించారని కొనియాడారు.
భారత రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే బతుకుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతడాని ఓ నానుడి ఉండేదని.. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరకు అడుగులు వేడయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఆప్కాబ్ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిదన్నారు. రైతులకు ఆప్కాబ్ వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. సహకార బ్యాంకులు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
రానున్న రోజుల్లో డిజిటలైజేషన్ తో సేవలు మరింత వేగాన్ని అందుకుంటాయన్నారు. ఆప్కాబ్ సేవలన్నీ మరింతగా విస్తరిస్తున్నాయన్నారు. ఆర్బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. దేశ చర్రితలోనే ఆప్కాబ్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తామని తెలిపారు సీఎం జగన్. ఆర్బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిస్తున్నాయని, ఆర్బీకేలను ఆప్కాబ్ తో అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
కాగా 1963 లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ప్రారంభమైంది. ఆప్కాబ్ పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించింది ఆప్కాబ్. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ నాలుగేళ్లలో రూ.251 కోట్ల లాభాల్లోకి ఆప్కాబ్ వెళ్లింది. రెండు సార్లు జాతీయ అవార్డులను సాధిచింది.