AP Telangana Today Updates: గాంధీ ఆసుపత్రిలో దారుణం... అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం!

గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం చేశారని చిలకలగూడ పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

ABP Desam Last Updated: 16 Aug 2021 05:41 PM
గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కా, చెల్లెళ్లపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం!

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం  చోటుచేసుకుంది.  ఉమామహేశ్వర్‌రావు అనే ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసినట్టు బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బావ చికిత్స కోసం వచ్చిన అక్కచెల్లెళ్లను గదిలో బంధించి మత్తు ఇచ్చి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసిన బాధితురాలు. గది నుంచి తప్పించుకున్న చెల్లి, అక్క ఆచూకీ ఇంకా తెలియాల్సిఉంది. 

టీఎంసీలో చేరిన సుస్మితా దేవ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ.. అంతలోనే మరో కండువా

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సుష్మితా దేవ్ టీఎంసీలో చేరిపోయారు.  అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన సుష్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. నేటి ఉదయం రాజీనామా లేఖను పంపిన ఆమె మధ్యాహ్నం టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. 





ట్రైబ్యునళ్ల ఏర్పాటులో జాప్యం.. కేంద్రంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం

ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయడం, సభ్యుల నియామకాలలో ఏడాది నుంచి చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదని, ట్రైబ్యునళ్ల ఏర్పాటును ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.

నారా లోకేశ్ అరెస్టు

రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ రావడం లేదు గన్ను రావడం లేదు. మధ్యాహ్నం కూడా పడుకుంటున్నాడు జగన్ రెడ్డి గారు. రమ్య హత్య జరిగిన 12 గంటల తరువాత సీఎం ట్వీట్ పెట్టారంటే మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుంది.’’ అని నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.



యూఎస్ ఓపెన్ 2021 గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పుకున్న రోజర్ ఫెడరర్

స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. యూఎస్ ఓపెన్ 2021 గ్రాండ్‌స్లామ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. వింబుల్డన్ ఆడుతున్న సమయంలో మరోసారి గాయం పెద్దది కావడంతో ఫెడరర్ యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. గాయాల వల్లే తాను టోక్య ఒలింపిక్ గేమ్స్ నుంచి వైదొలిగిన విషయాన్ని గుర్తు చేశాడు. స్విస్ మాస్టర్‌కు త్వరలో మోకాలికి సర్జరీలు జరగనున్నాయి. వయసు మీద పడటంతో మునుపటిలా ప్రదర్శన చేయడం కష్టమవుతుందని ఫెడరర్ వ్యాఖ్యానించాడు.

రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

గుంటూరులో ఆదివారం నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో ఆమె మృతదేహానికి పోస్టు మార్టం చేశారు. ఆ వెంటనే రమ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు యత్నించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత.. మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దుకాణాలను బీజేపీ కార్యకర్తలు తెరవకుండా అడ్డుకుంటుండడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వినని వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో మల్కాజ్‌గిరి వినాయక నగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. అక్కడే వారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టి బొమ్మను దహనం చేశారు. వెంటనే పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంట్లో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు. ఈ సమావేశానికి సినీ ప్రముఖులైన నాగార్జున, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, దిల్ రాజు, ఎస్వీ ప్రసాద్, రవిశంకర్, సి.కల్యాణ్, ఆర్.నారాయణమూర్తి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు.

కళ్లు మూసుకుని పార్టీని నడుపుతున్నారా.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్..!

కాంగ్రెస్ మహిళా నాయకురాలు, మాజీ ఎంపీ సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంపై సీనియర్ నేత కపిల్ సిబల్ తనదైనశైలిలో స్పందించారు. యువ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుంటే.. పార్టీని బలోపేతం చేయాలని సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నాం.. కానీ మీరు ముసలివారు, వృద్ధులు అని తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. కళ్లు మూసుకుని పార్టీని నడుపుతున్నారా అని కామెంట్ చేశారు.

ఇంట్లోనే డ్రగ్స్ తయారీ

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ఇంట్లో రహస్యంగా నడుపుతున్న ఓ ల్యాబ్‌పై హైదరాబాద్, బెంగళూరు ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు దాడులు చేశారు. బాలానగర్‌లోని ఓ ఇంట్లో ల్యాబ్ ఏర్పాటు చేసి మత్తుపదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రెండు నెలలుగా ఇంట్లోనే డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు నిందితుడు సుధాకర్ తెలిపారు. నిందితుల నుంచి సుమారుగా 3.25 కిలోల ఆల్ఫ్రజోలం అనే మత్తు పదార్థాలను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.12.75 లక్షల నగదు, రెండు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Also Read: In Pics: అడుగడుగునా కేసీఆర్, అంబేడ్కర్ కటౌట్లు.. కానీ, ఈ ఫ్లెక్సీ పొరపాటా లేక.. అసలేం జరిగిందో..!

సీఎం నివాసంపై దాడులు.. షిల్లాంగ్‌లో రెండు రోజులపాటు కర్ఫ్యూ

నిషేధిత తీవ్రవాద సంస్థ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ నేత చెరిస్టర్‌ ఫీల్డ్ ఎన్‌కౌంటర్‌ మేఘాలయలో దుమారం రేపుతోంది. అతడి మద్దతుదారులు సీఎం కాన్రాడ్ సంగ్మా నివాసంపై పెట్రో బాంబులతో ఆదివారం దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌‌లో రెండు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఇంటర్ నెట్ సేవల్ని నిలిపివేశారు. మరోవైపు హోం మంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ పార్టీకి సుష్మితా దేవ్ రాజీనామా

ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ సుష్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ సుష్మితా దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. ట్విట్టర్‌లోనూ ఫార్మర్ మెంబర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని తన వివరాలు అప్‌డేట్ చేశారు.

Background

తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు నేటి నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేయనున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.