కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్ వాడీ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం చర్చలు చేపట్టినప్పటికీ విఫలమవుతూ వచ్చాయి. తాజాగా అంగన్‌వాడీల కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్‌వాడీ వర్కర్లకు, సహాయకులను వర్కర్లుగా ప్రమోట్‌ చేసే వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత ఒన్‌టైం బెనిఫిట్ రూ.50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచారు. అంగన్‌వాడీ సహాయకుల సర్వీసు విమరమణ తర్వాత ఒన్‌టైం బెనిఫిట్‌ రూ.40 వేలకు పెంచారు. 


అంగన్‌వాడీ వర్కర్లకు TA/DA నెలకు ఒకసారి, అంగన్వాడి హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించాలని నిర్ణయించింది. గ్రామీణ/గిరిజన ప్రాంతాలలో ఉన్న 16,575 అద్దె భవనాలకు, పట్టణ సముదాయంలో ఉన్న 6,705 అద్దె భవనాలకు రూ.66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,770 మెయిన్ అంగన్వాడి సెంటర్స్ కు రూ.500 చొప్పున, 6,837 మినీ అంగన్వాడి సెంటర్స్ కు రూ.250 చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించింది.


సొంత భవనాల నిర్వహణ- గోడల పెయింటింగ్ లు, చిన్నపాటి మరమ్మత్తుల కింద 21,206 అంగన్వాడి సెంటర్స్ కు (ఒకొక్క కేంద్రానికి Rs.3 వేల రూపాయల చొప్పున) Rs.6.36 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనుంది.