Funeral with honors for organ donors :  అవయవదానం చేసే వారికి ఏపీ ప్రభుత్వం అరదైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకుంది.  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటే మరణించిన వ్యక్తికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఈ గౌరవం ప్రాణం నిలిపిన వారి కన్నా పొందేందుకు అర్హులు ఎవరూ ఉండరని చెబుతూ ఉంటారు.  అందకే ఏపీ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.  అవయవ దాతల అంతిమ సంస్కారాలు ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. 


ఆర్డీవో స్థాయికి తక్కువ కాని  వారి నేతృత్వంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు              


చనిపోయిన వారు,  బ్రెయిన్ డెడ్  అయిన వారి అవయవాలను అవసరార్ధులకు అమర్చడం ద్వారా . వారికి పునర్జన్మను ఇచ్చే జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా  అవయవ దాతల అంతిమ సంస్కారాలను  ప్రభుత్వం నిర్వహించనుంది.  RDO స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో  ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన నియమావళిని పేర్కొంటూ ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. 


అవయవదానంపై అవగాహన పెంచేందుకు వినూత్న నిర్ణయం          


అవయవ దానం వల్ల కొన్ని వందల మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని విస్తృతంగా ప్రచారం  చేస్తున్నారు.  యాక్సిడెంట్లు, బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులు ఇటీవలి కాలంలో  అవయవదానం చేసేందుకు అంగీకరిస్తున్నారు. అయితే సహజంగా చనిపోయిన వారి గురించి పెద్దగా సమాచారం రావడం లేదు. జీవన్  దాన్ లో నమోదు చేసుకున్న వారు చనిపోయిన తరవాత తమ అవయవాలను ఇవ్వడానికి అంగీకరించినట్లవుతుంది.  


90వేల మంది ప్రాణభిక్ష కోసం ఎదురు చూపులు                                                


యేటా ఐదు లక్షల మంది అవయవాలు చెడి‌పోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.  జాతీయ స్థాయిలో చాలా స్వల్పంగా ఈ అవయవ దానమ రిజిస్ట్రేషన్ లు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కొంత మందికి మతాచారాలు అడ్డుగా వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీల మార్పిడి కోసం ప్రజలు చాలా మంది క్యూలో ఉన్నారు.  వయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా ప్రభుత్వం తెలిపింది.  సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా...‌ ప్రజల్లో మార్పు రాలేదని ఇటీవల ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు. ఏపీలో  260 మంది అవయవ దానం‌కోసం ముందుకు వచ్చారని  తెలంగాణలో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారని కానీ  90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారన్నారని సత్యకుమార్ తెలిపారు. అందుకే అవయవదానం చేసే వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలని నిర్ణయంచడంతో ఇక ముందు ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు.