ప్రభుత్వ రంగంలో ఏదైనా పనికి టెండర్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్లు వరుస కడతారు. పెద్ద పెద్ద సంస్థల నుంచి పనుల స్థాయిని బట్టి అధికార పార్టీ నేతల ద్వితీయ శ్రేణీ నేతలూ పోటీ  పడతారు. ఓ రకంగా అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరు ఇలాంటి కాంట్రాక్టులే. కానీ ఏపీలో అంతా రివర్స్ అయిపోయింది. కాంట్రాక్టులు ఇస్తామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. టెండర్లు వేయడం లేదు. అధికారులు సమావేశాలు పెట్టి సర్ది చెప్పినా నేరుగా బ్యాంకుల నుంచి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పినా ముందుకు రావడంలేదు. దీంతో ఏపీ టెండర్లలో అసలేం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది. 
రోడ్ల నుంచి భవనాల వరకూ దేనికీ స్పందించని ఏపీ కాంట్రాక్టర్లు..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయి. ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. దీంతో అప్పులుతీసుకుని రోడ్లు బాగు చేయాలని పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అలాగే పెట్రోల్, డీజిల్‌పై రోడ్ల మరమ్మతుల కోసం లీటర్‌పై రూపాయి సెస్ వసూలు చేస్తున్నారు . దీంతో నిధుల కొరత లేదని అధికారులు  టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఒక్క రోడ్ల విషయంలోనే కాదు న్యూ డెలవప్‌మెంట్ బ్యాంక్ సాయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న రహదారుల పనులకూ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రూ. 6400 కోట్లతో ఆ పనులను చేపట్టాలని టెండర్లు పిలిచారు. ఒక్కో పనికి ఒక్కో టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో   రద్దు చేశారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అంతే కాదు చివరికి అమరావతిలో హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి పిలిచిన టెండర్లకూ స్పందన లేదు.  రూ. 29 కోట్ల 40  లక్షల అంచనా వ్యంతో 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టడానికి టెండర్లు పిలిచారు. కానీ స్పందన లేదు.  గతంలో అమరావతిలో పనులు అంటే  ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడేవి. అలా దక్కించుకున్నవే శర వేగంగా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేశాయి.  ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం ఆరు నెలల్లోనే పూర్తయింది. సెక్రటేరియట్ భవనాలూ అంతే వేగంగా పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు ఎవరూ టెండర్లు కూడా వేయడం లేదు.


Also Read : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం
చేసిన పనులకు వేల కోట్లలోనే బకాయిలు..!  
సాధారణంగా కాంట్రాక్టర్లు ఓ పని చేసి బిల్లులు వసూలు చేసుకుంటారు. ఆ సొమ్ముతో మరో కాంట్రాక్ట్ పని చేస్తారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి వారికి గతంలో చేసిన పనుల తాలుకా బకాయిలే పెద్ద ఎత్తున విడుదల కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో చేసిన పనులకు తాము బిల్లులు ఇవ్వబోమని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.  రెండేళ్లుగా అటు ఉపాధి హామీ దగ్గర్నుంచి ఇటు రోడ్ల పనులు చేసిన వారికీ బిల్లులు చెల్లించడం లేదు. కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ చేస్తేనే వారుపనులు చేస్తామని నేరుగానే చెబుతున్నారు. మరికొంత మంది అయితే బిల్లుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు వెనుకాడకపోవడంతో నేరుగా బ్యాంకుల ద్వారా  చెల్లిస్తామని బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండగని కాంట్రాక్టర్లు, ఆ సంస్థలతో మాట్లాడాలని ప్రభుత్వ ఉన్నతాధికారులే ఇంజనీర్లను ఆదేశించారు. కానీ వారి మాటలపై కాంట్రాక్టర్లకు విశ్వాసం లేకుండా పోయింది. ఫలితంగా పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.


Also Read : తెలుగు బిగ్‌బాస్‌కు సూపర్ రేటింగ్స్
అరకొర పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం బెదిరింపులు..! 
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో  చేస్తున్న పనులన్నింటినీ నిలిపివేసింది. అన్నింటికీ రివర్స్ టెండర్లకు వెళ్లింది. కాంట్రాక్టులు రద్దు చేయడంతో అప్పటి వరకూ చేసిన పనులకు చెల్లించాల్సినవి చెల్లించలేదు. కొత్తగా రివర్స్ టెండర్లేసిన వారు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇతర కారణాలతో పనులు ప్రారంభించలేదు. అనేక సాగునీటి ప్రాజెక్టుల్లో పనులు నత్త నడకన సాగుతున్నాయి. అభివృద్ధి పనులకోసం అతి స్వల్పంగా ఖర్చు పెడుతున్నారు. అదే సమయంలో రాజకీయ నేతల బెదిరింపులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోడ్ కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్న వీడియో ఇప్పటికే వైరల్ అయింది. ఆ పని ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేతో పాటు బెదిరించిన నేత కూడా హాజరయ్యారు. కానీ ఇస్తామన్న కమిషన్ ఇవ్వకుండా పనులు ప్రారంభించినందుకు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు ఉన్నాయి.



ప్రభుత్వం విశ్వాసం పెంచుకుంటేనే అభివృద్ది పనులు.. !
ఓ వైపు బిల్లులు రాకపోవడం మరో వైపు అధికార పార్టీ నేతలు కమిషన్ల కోసం బెదిరింపులకు దిగడం వంటి పరిణామాలతో ఏపీలో ప్రభుత్వ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ఏపీ ప్రభుత్వం  అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కాంట్రాక్టర్లకు నేరుగా బ్యాంకుల నుంచి చెల్లించేలా చేస్తామని హామీ ఇస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే.. రోడ్ల మరమ్మతులు జరుగుతాయి. హైకోర్టు భవన నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇలా జరగాలంటే ప్రభుత్వం ముందుగా కాంట్రాక్టర్లలో నమ్మకం పెంచుకోవాల్సి ఉంది. 
Also Read : హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదాతో ఎవరికి లాభం..?