AP CM Chandrababu Naidu responds to IndiGo crisis: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గారు ఏపీ సెక్రటేరియట్లో జరిగిన ప్రెస్ మీట్లో ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంపై స్పందించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలు పాటించకపోవడం వల్ల విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇది ఎయిర్లైన్ మేనేజ్మెంట్ లోపమని స్పష్టం చేశారు. DGCA టైమ్ ఇచ్చినా ప్రమాణాలను ఇండిగో పాటించలేదు. దీంతో విమానాలు రద్దు అయ్యాయి, ఇబ్బందులు వచ్చాయి. క్షమాపణలు చెప్పినా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నా హెలికాప్టర్ కూడా నిబంధనల మేరకు కొన్ని గంటలే ప్రయాణం చేస్తుందని గుర్తు చేశారు.
తాము ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఓ టీడీపీ నేత.. నారా లోకేష్ కూడా మానిటర్ చేస్తున్నారని చెప్పడం వివాదాస్పదమయింది. ఈ అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తాము మానిటర్ చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. కేంద్ర పరిధిలోని అంశమని..కేంద్ర మంత్రి .. కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీ అని గుర్తు చేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి .. రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీ కావడంతో.. జాతీయ మీడియాలో ఎక్కువగా టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. నవంబర్ 2025లో అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలు ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టారు. ఈ నిబంధనల ప్రకారం పైలట్లకు 36 నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. అయితే, ఇండిగో ఈ మార్పులకు సరైన సన్నాహాలు చేయకపోవడంతో డిసెంబర్ మొదటి వారంలో 1,500కి పైగా విమానాలు రద్దయ్యాయి. 5.86 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్, విజయవాడ వంటి ఏపీ ఎయిర్పోర్టుల్లో కూడా ప్రయాణికులు ఆందోళన చేశారు.
కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగోకు రిఫండ్లు పూర్తి చేయాలని ఆదేశించింది. ఫేర్ క్యాప్లు విధించి సర్జ్ ప్రైసింగ్ నిరోధించారు. రైల్వేలు 89 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశాయి. DGCA హై-లెవల్ ఇంక్వైరీ ప్రారంభించింది, ఫెబ్రవరి 10, 2026 నాటికి స్థిరత్వం వస్తుందని అంచనా. ఈ సంక్షోభం విమానయాన రంగంలో పోటీ పెంచాలని, మరిన్ని ఎయిర్లైన్లు ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయి.