Fake Notes in AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పరిధిలోని మన్యం ప్రాంతంలో నకిలీ నోట్ల చలామణి కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేంద్రంగా వీటిని తయారు చేసి ఏపీలో ఈ డబ్బులను మారుస్తున్నారు. విషయం గుర్తించిన పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీఆర్ పురం మండలం రేఖలపల్లిలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తుండగా... పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. మన్యంలో ఉన్న గిరిజన ప్రజలే లక్ష్యంగా తెలంగాణకు చెందిన తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి పాల్వంచలో పొదిల మురళి ఇంట్లో నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. వీటిని మన్యంలోని పలు ప్రాంతాల్లో చలామణి చేస్తున్నారు.


తెలంగాణలో దొంగనోట్ల తయారీ - ఏపీలో మార్పిడి


పాల్వంచలో ముద్రించి.. ఆంధ్రలోని వరరామ చంద్రాపురం, చింతూరు, కూనవరం, ఛత్తీస్ గఢ్ లోని కుంట పరిసర ప్రాంతాల్లో మారుస్తున్నారు. ఎక్కువగా రద్దీగా ఉండే పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు, హోటళ్ల వద్ద చీకటి పడిన తర్వాత మార్పిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల విలువైన నోట్లు మార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా నకిలీ నోట్లు మాత్రమే కాకుండా బ్లాక్ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సినిమా షూటింగ్ ల కోసం ప్రత్యేకంగా ముద్రించిన రూ.500 నోట్లను అమాయకులకు ఇచ్చి మోసగిస్తున్నట్లు వెల్లడించారు. 


పోలీసులకు చిక్కిన నిందితుడు - 44.50 లక్షల దొంగ నోట్లు స్వాధీనం


ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు దొంగనోట్ల ముఠాను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. దొంగ నోట్లను చలామణి చేస్తూ.. సదరు ముఠా వీఆర్ పురం పోలీసుల చేతికి చిక్కారని తెలిపారు. వీరి నుంచి 44 లక్షల 50 వేల రూపాయల దొంగ నోట్లు, ప్రింటర్లు, లామినేషన్ మిషన్ ప్రింటింగ్ కోసం ఉపయోగించిన పేపర్ బండిల్స్, హైపో లిక్విడ్ స్వాధీన పరుచుకున్నారు. వాటితో పాటు మోటాడ్ వాడే బ్లాక్ పేపర్, కరెన్సీ సైజులో కట్ చేసి.. వాటిని కెమికల్ తో కడిగితే 500 రూపాయలు నోట్ వస్తుందని నమ్మబలికే బ్లాక్ పేపర్ బండిల్స్, ఒక ఆటోను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. దొంగనోట్ల ముఠాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న చింతూరు సబ్ డివిజన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. 


ఇదే ఏడాది జనవరిలో పింఛన్ల నగదులో దొంగనోట్ల మార్పిడి


ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం మండలం నరసాయ పాలెంలో ప్రభుత్వ సామాజిక పింఛన్ల నగదులో దొంగ నోట్లు వెలుగు చూశాయి. ఎప్పటిలాగే సచివాలయ సంక్షేమ సహాయకుడు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి ఎస్సీ కాలనీకి చెందిన వాలంటీరు ఎం. ఆమోస్‌ కు అందించారు. అయితే ఆమోస్ ఆదివారం రోజు లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. పింఛను అందుకున్న మహిళ రూతమ్మ రూ. 500 నోట్లు మూడింటిని నకిలీవిగా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి వరకు పంచిన నగదును వారు లబ్ధిదారుల వద్ద పరిశీలించగా అందులో 39 (రూ. 500 ల) నోట్లు నకిలీవిగా తేలాయి. దీనిపై ఎంపీడీవో రంగసుబ్బ రాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత బుకాయించిన సదరు వాలంటీరు అధికారులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయాన్ని బయట పెట్టాడు. తప్పు చేసింది తానేనని అంగీకరించాడు. దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు. అమోస్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయనేది విచారణలో తేలాల్సి ఉంది.