Puri Jagannatha Ratna Bhandaram: ఒడిశాలోని పూరీ రత్నభాండాగారం... సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తూనే ఉంది. రత్న భాండాగారంలోని లోపలి గదిలో నాగబంధం ఉందని... గది తెరిస్తే అరిష్టం వస్తుందని చాలా మంది నమ్మారు. 46ఏళ్లు ఆ  గది తెరవలేదు. అయితే.. ఆ గదిని రిటైర్డ్‌ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్‌రథ్‌ కమిటీ తెరిచేసింది. అందులో నాగబంధం లేదు.. పాములూ లేవని తేల్చిచెప్పింది. ఆ మిస్టరీ వీడిందిలే అనుకునే లోపు... ఇప్పుడు మరో వార్త ఆసక్తి రేపుతోంది. విలువైన సంపద  దాచిన గది... లోపలి భాండాగారం కాదని... మరో రహస్య గది ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ రహస్యగదిలో విలువైన... వెల్లకట్టలేని సందప ఉందని అంటున్నారు. అయితే... ఆ గదికి.. ఎవరూ చేరుకోలేరని.. బ్రిటీష్‌ వాళ్లు కూడా  ప్రయత్నించి విఫలమయ్యారు. మరి... ఆ రహస్య గది మిస్టరీని రిటైర్డ్‌ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్‌రథ్‌ కమిటీ కనుగొంటుందా..? అందరూ అనుకున్నట్టు నాగబంధం ఉన్నది... ఆ రహస్య గదికేనా..? ఏమో.. కావొచ్చేమో...?


పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం.. రోజురోజుకూ ఆసక్తి రేపుతోంది. 46ఏళ్లుగా తెరుచుకోని రత్న భాండాగారాన్ని తెరవనైతే తెరిచారు గానీ... లోపలి భాండాగారంలోని సంపద మాత్రం ఇంకా లెక్కించలేదు. బయట భాండాగారంలోని ఆభరణలను  మరో గదికి తరలించామని చెప్పిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్‌రథ్‌ కమిటీ... లోపలి భాండాగారంలోని సంపదను మాత్రం మరో రోజు తరలిస్తామని చెప్పి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే... ఇప్పుడు రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని..  ఒడిశాకు చెందిన కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ గదిలోకి వెళ్లే మార్గం అంత ఈజీ కాదని... సొరంగ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ రహస్య గదిలో విలువైన సంపద దాచిపెట్టారని చెప్తున్నారు చరిత్రకారులు. 34 స్వర్ణ  కిరీటాలు. రత్నాలు పొదిగిన సింహాసనాలు ఉన్నాయంటున్నారు. 1902లో బ్రిటీష్‌ వాళ్లు... ఆ సొంగ మార్గాన్ని కనుక్కునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్తున్నారు. రత్నభాండాగారాన్ని తెరిపించిన కేంద్ర ప్రభుత్వం... ఆ రహస్య గదిని  కూడా గుర్తించే ప్రయత్నం చేయాలంటున్నారు చరిత్రకారులు.


రహస్య గది ఎక్కడ ఉంది.. ఎలా వెళ్లాలి..?
ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్‌ మిశ్ర రహస్య గది గురించి చెప్పిన వివరాల ప్రకారం.. పూరీ రాజు కపిలేంద్రదేవ్‌ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపదను జగన్నాథుడికి సమర్పించారు. దానికి  సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పుషోత్తమ్‌దేవ్‌ హయాంలోనూ స్వామివారికి ఆపార సంపద సమకూరింది. ఆ సంపదను అంతా... పూరీ రత్నభాండాగారంలోని రహస్య గదిలో దాచారు. రత్న భాండాగారం కింద సొరంగ మార్గం  తవ్వి.. రహస్య గది నిర్మించారు. ఆ గదిలో ఆభరణాలు భద్రపరిచారు. రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన వడ్డాణాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయి. వాటి విలువ  వెలకట్టలేనిది. పట్టాభిషేకంలో భాగంగా... పూరీ గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని చరిత్రకారుడు నరేంద్రకుమార్‌ మిశ్ర చెప్పారు. 


మరో చరిత్రకారుడు నరేష్‌చంద్రదాస్‌ చెప్పిన వివరాల ప్రకారం... కళింగ సామ్రాజ్యంపై ముస్లిం దండయాత్రల సమయంలో సంపదను కాపాడేందుకు అప్పటి రాజులు ప్రయత్నించారు. రత్నభాండాగారంలో రహస్య గదులు నిర్మించి.. సంపద మొత్తం  వాటిలో దాచిపెట్టారు. ఈ విషయం తెలిసి... 1902లో అప్పటి బ్రిటీష్‌ పాలకులు ఒక వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపారు. అయితే... అతను ఏమయ్యాడన్నది తేలియలేదు. దీంతో... బ్రిటీష్‌ పాలకులు ఆ ప్రయత్నం విరమించుకున్నారు.  శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రంలో... రహస్య గదులు, సొరంగ మార్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించి చరిత్రలో ఆధారాలు ఉన్నా... వాటిని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారని చరిత్రకారుడు నరేష్‌చంద్రదాస్‌ చెప్తున్నారు.  46ఏళ్ల  పాటు తెరవమని రత్న భాండాగారాన్ని కేంద్ర ప్రభుత్వం తెరిపించింది. మరి... రహస్య గది అన్వేషణను కూడా చేపడుతుందా...? చరిత్రకారులు చెప్తున్న విషయాలపై దృష్టి పెడుతుందా..? చూద్దాం ఏం జరుగుతుందో..?