Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 04 Oct 2023 12:17 PM
పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

పెడన సభలో అసాంఘిక శక్తులతో దాడులు చేయించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. అలాంటి సమాచారం మీ వద్ద ఉంటే సాక్ష్యాలు సమర్పించాలని ఆయనకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ సమాచారానికి బేస్ ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన నోటీసులకు రిప్లై రాలేదని అలా రాని పక్షంలో ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని అభిప్రాయపడాల్సి ఉంటుందన్నారు. 

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ పిటిషన్‌పై విచారణ వాయిదా 

ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో సీఐడీ తన ఇంటి వద్దే ప్రశ్నించాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసు వేేరే బెంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని జడ్జి కోరడంతో విచారణ వాయిదా పడింది. అనారోగ్య కారణంగా తన ఇంటి వద్దే ప్రశ్నించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ వేశారు. దీనిపై విచారించాల్సిన న్యాయమూర్తి ఈ కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సూచించడంతో కేసు విచారణ వాయిదా పడింది. మరో రెండు రోజులు నారాయణపై ఎలాంటి ఒత్తిడి చేయొద్దని సీఐడీకి ఆదేశించారు. 

అలిపిరిలోని శిథిలావస్థకు చేరుకున్న రాతి మండపం పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయం

అలిపిరి కాలిబాట మార్గంలో వన్యమృగాల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాంమని, నడక దారిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లల అనుమతిపై ఇంకా అటవీ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని టిటిడి ఈవో.ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు.. బుధవారం ఉదయం అలిపిరి కాలిబాట మార్గంలో భక్తులు బస చేసి రెండు రాతి మండపాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ రాతి మండపాల్లో కుడి వైపు గల మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ మండపాన్ని పునర్నిర్మాణం చేయాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.


టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అలిపిరి మెట్లు మార్గంలో మొదటి ప్రాంతంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందన్నారు. కుడివైపు ఉన్న రాతి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో రిపేర్ చేయడానికి వీలు లేకుండా ఉందన్నారు.. ఈ క్రమంలోనే రాతి మండపం రాళ్లను పునర్నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన తిరుమలలో పార్వేటి మండపం కూల్చి, పునర్నిర్మాణం చేశామని దీనిని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారన్నారు..


16వ శతాబ్దంలో సాలువ నరసింహారాయులు నిర్మాణం చేశారని, దాదాపు 136 లక్షలతో పునర్నిర్మాణం చేస్తున్నామని, మొత్తం 20 పిల్లర్స్ తో యథావిధిగా ఉన్న నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నడక మార్గంలో చిరుతల సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించడం జరిగిందన్నారు. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాలిబాట మార్గంలో అటవీ శాఖ నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించాలి అనే అంశంపై ఇంకా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, కాలిబాట మార్గంలో కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు ఇంకా రిపోర్టు ఇవ్వలేదని చెప్పారు. వన్యమృగాల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, ట్రాప్ కెమెరాలతో పాటు సిసి కెమెరాలతో కాలిబాట మార్గంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, అదేవిధంగా భక్తుల భద్రత దృష్ట్యా సిబ్బందిని ఏర్పాటు చేశామని టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన- బీజేపీ నేతల అరెస్టు 

నిర్మల్ జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రూ.1,157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దిలావర్ పూర్ మండలం గుండంపెల్లికి నుంచి టూర్ ప్రారంభమైంది. గ్రామ శివారులోని గోదావరి నది వద్ద నిర్మించిన ప్యాకేజీ 27 ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా దిలావర్ పూర్ గ్రామ శివారులో నిర్మించిన సిస్టర్న్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడే పంపింగ్ ద్వారా కాలువల్లోకి సాగు నీరు చేరుతోంది. కాలువల్లోకి గోదావరి జలాలు చేరగానే మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిలు గంగమ్మకు వాయినం సమర్పించి పూజలు చేస్తారు. అనంతరం సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామ శివారుకు చేరుకుంటారు. అక్కడే 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేస్తారు. నిర్మల్ తో పాటు, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి వచ్చిన ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో నిర్వహించే సమావేశంలో మంత్రి పాల్గొంటారు. 
మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలోని పాత తహసీల్ కార్యాలయ స్థలం వద్దకు చేరుకుంటారు. అక్కడే రూ.10.15 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. నిర్మల్ పట్టణంలో రూ. 2 కోట్ల టీయూఎఫ్ఎస్ఐడీసీ నిధులతో నిర్మించే ధోబీఘాట్ పనులు, రూ.4 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తారు. నిర్మల్ పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు అమృత్ పథకంలో భాగంగా రూ.62.50 కోట్ల వ్యయంతో చేపట్టే పనులు ప్రారంభించనున్నారు. రూ.50 కోట్ల నిధులతో నిర్మల్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. 
మొత్తం రూ.1,157 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. చివరకి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డిలు స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  కేటీఆర్ పర్యటన వేళ బిజెపి నాయకులు రమాదేవి, నిర్మల్ బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 

తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు- మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

నేడు సుప్రీంకోర్టులో 'ఓటుకు నోటు' కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఒక పిటిషన్, తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారించనుంది. 

విధి నిర్వహణలో చనిపోయిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి 30 లక్షల పరిహారం

అక్టోబర్ 30న ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన నరేంద్రకు డీజీపీ పరిహారం అందజేశారు. ఊరేగింపు త్వరగా ముగించాలన్న కానిస్టేబుల్ నరేంద్రను స్థానిక యువకుడు ఉలస రామకృష్ణ దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స తీసుకుంటూనే బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. కానిస్టేబుల్ నరేంద్ర  మృతిపై జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి 30 లక్షల పరిహారం ప్రకటించారు. 

కాసేపట్లో కేంద్రమంత్రి వర్గం సమావేశం- తెలంగాణ పసుపు బోర్డుకు ఆమోదం

మరికాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం


పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం కు ఆమోదం తెలపనున్న కేంద్ర మంత్రివర్గం


మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

వరంగల్‌లో ప్రీతి ఆత్మహత్యకు కారణమైన డాక్టర్‌ సైఫ్‌కు ఊరట

డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ సైఫ్‌కు ఊరట లభించింది. ఆయనపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ను తాత్కాలిక రద్దు చేస్తున్నట్టు కాకతీయ మెడికల్ కాలేజీ అధికారులు వెల్లడించారు.  హై కోర్ట్ ఆదేశంతో తిరిగి క్లాసులకు అవకాశం ఇచ్చారు KMC అధికారులు. వారం తర్వాత యాంటీ ర్యాగింగ్ కమిటీ మరోసారి సమావేశంకానుంది. 

సిక్కింలో ఆకస్మిక వరదలు- 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

సిక్కింలో తీస్తా నదికి వరద పోటెత్తింది. దీంతో లోనాక్ సరస్సు  ఉప్పొంగి 23 మంది ఆర్మీ సైనికులు గల్లంతయ్యారు. 

చిత్తూరు జిల్లా రెండు మండలాల్లో చిరుత సంచారం- ఒంటరిగా తరగొద్దని అధికారుల సూచన

చిత్తూరు జిల్లా వి.కోట, పూతలపట్టు రెండు మండలాల్లో చిరుత పులి సంచారం కలకలం రేగింది. నక్కనపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నాయి. కుక్కని వేటాడుతుండగా స్థానికులు గమనించారు. మవత్తూరు గ్రామ సమీపాన పాల ఆటోకి అడ్డుగా వచ్చిన చిరుతను సెల్ ఫోన్ డ్రైవర్ చిత్రీకరించాడు. నిన్న కర్ణాటకలో చిరుతపులి ఉంది అని ప్రచారం జరిగింది. అదే పులి ఇటు వచ్చింది అంటూ భయాందోళన చెందుతున్నారు చుట్టూ పక్క గ్రామస్తులు. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. గ్రామ ప్రజలకు ఒంటరిగా తిరగొద్దని అటవీశాఖ అధికారులు  హెచ్చరించారు. 

Background

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలతో పాటు సీఐడీ పోలీసులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు సంచలనంగా మారాయి. ఢిల్లీలో ఉన్న  నారా లోకేష్ ను అరెస్ట్ చేసి తీసుకు వచ్చేందుకు టీమ్ కూడా వెళ్లిందన్నారు. లోకేష్ కనిపించడం లేదని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ అరెస్టు చేయడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.


ఫైబర్ గ్రిడ్ ఎఫ్ఐఆర్‌లో అసలు లోకేష్ పేరు లేదన్న సీఐడీ                   


ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే లోకేష్‌ను ఇంతవరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒకవేళ చేరిస్తే ఆయనకు సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. 41 ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామన్నారు.  
 
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కేసులో పదో తేదీన లోకేష్ సీఐడీ విచారణ                  
 
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్‌ సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ  సిఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.  సిఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో   లోకేష్ సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  హెరిటేజ్ డాక్యుమెంట్లు అడిగారని.. లోకేష్ హెరిటేజ్‌లో షేర్ హోల్డర్లు మాత్రమేనన్నారు.  వాటిని లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని  సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, బుధవారమే  విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు.  అయితే అంత తొందర ఏముందని  లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.  ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి వరకూ అరెస్టు చేసే అవకాశం లేదు. 


స్కిల్ కేసులో ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు              






 


ఏపీ సీఎం వైఎస్ జగన్ కక్షపూరిత రాజకీయాల కారణంగానే చంద్రబాబు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడింది. స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు చట్టాన్ని పాటించలేదని ఆ పార్టీ ఆరోపించింది. అవినీతి నిరోధక చట్టం 2018 సవరణ ప్రకారం, మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి ముందు రాష్ట్ర గవర్నర్ నుంచి సీఐడీ అనుమతి పొందాలని, కానీ సీఐడీ వాటిని అమలు చేయకుండానే చంద్రబాబును అరెస్ట్ చేసిందని పేర్కొంది. 


చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ విమర్శించింది. సీఐడీ సెక్షన్ 17ఏ ప్రయోగించిందని, చట్టం నిర్దేశించిన విధివిధానాలను పాటించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. అవినీతి నిరోధక చట్ట సవరణ తర్వాత అంటే 2018 తర్వాత దర్యాప్తు లేదా కేసు నమోదైతే, గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరని పేర్కొంది. అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి, ఉన్నతాధికారులు పబ్లిక్ సర్వెంట్లను విచారించకూడదని తెలిపింది. 


అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందు, 2018కి ముందే విచారణ ప్రారంభమైందని జగన్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రభుత్వ వాదన ప్రకారం 2018కి ముందే దర్యాప్తు ప్రారంభమైనట్లు ఎలాంటి రుజువు లేదని టీడీపీ ఆరోపించింది. ఒకవేళ ఉంటే ప్రభుత్వ తరఫు న్యాయవాది తప్పనిసరిగా ఆయా పత్రాలను కోర్టుకు సమర్పించాలని, కానీ అలాంటివి ఏవీ సమర్పించలేదంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేనందున, విచారణను మరింత జాప్యం చేసేందుకు కోర్టు అడిగిన పత్రాలను సమర్పించడానికి అదనపు సమయాన్ని కోరుతోందని విమర్శించింది. దీని వెనక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది.


చంద్రబాబు నాయుడుని జైలులోనే నిర్బంధించాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశించిన పత్రాలను సమర్పించేందుకు సమయం కోరడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోందని టీడీపీ ఆరోపించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎలా నరకయాతన పెడుతోంది అనడానికి ఇదే నిదర్శనమని, కేవలం ఆరోపణల ఆధారంగా పలుమార్లు అరెస్టులు చేసి టీడీపీ నేతలను సుదీర్ఘ కాలంగా జైలులో ఉంచేందుకు చూస్తోందని మండిపడింది. ఇలా చేయడం ద్వారా ఎన్నికల ముందు టీడీపీ నాయకత్వాన్ని దెబ్బకొట్టాలనే వ్యూహంతో జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తింది. 









స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మళ్లీ సోమవారానికి (అక్టోబరు 9) వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.


నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టులో జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు, సిద్ధార్థ లుథ్రా, హరీశ్‌ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్‌ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్‌ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని అన్నారు. ఆరోపణలు ఎప్పుడు వచ్చాయనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడు అనేది చర్చించాలని హరీశ్ సాల్వే వాదించారు.





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.