అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం.  ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. కారులో బళ్లారి నుంచి అనంతపురం వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోకా వెంకటప్ప దుర్మరణం పాలయ్యారు. 






పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ


అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ ఘటనలో ఉరవకొండ మండలం నింబగల్లు, బూదగవి, లత్తవరం గ్రామాలకు చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 


బీజేపీ నేత దుర్మరణం


ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్‌కు, ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృత దేహాలను ఘటనా స్థలం నుంచి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బళ్లారిలో పెళ్లికి హాజరై తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప మరణించారు. ఆయన కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జయింది. 


మృతుల వివరాలు


1.అశోక్- బొమ్మణహల్ గ్రామం 
2. రాధమ్మ- బొమ్మణహల్ గ్రామం
3. సరస్వతి-బొమ్మణహల్
4. శివమ్మ-పిల్లల పల్లి
5. శుభద్రమ్మ-రాయల దొడ్డి
6.స్వాతి(38)-లత్తవరం
7.జాహ్నవి(12) లత్తవరం
8.వెంకటప్ప(60)-నింబగల్లు
9.జశ్వంత్(12)లత్తవరం