Anantapur Police Arrest Cyber Criminals In Jammu And Kashmir: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. అనిల్ కుమార్ అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తన ఫోన్‌లోని టెలిగ్రామ్ మెసెంజర్‌కు సెప్టెంబర్ 21న ఒక మెసేజ్ వచ్చింది. మీకు ఏమైనా పార్ట్ టైమ్ జాబ్ చేయాలని ఉందా అని లింక్ వచ్చింది. పార్ట్ టైం జాబ్ కు ఆశపడి అనిల్ కుమార్ ఆ లింకును ఓపెన్ చేశాడు. 
లింక్ ఓపెన్ చేసిన అనిల్‌ నిర్వాణ డిజిటల్ గ్రూపులో ఆడ్ అయ్యాడు. అనిల్‌కు ప్రత్యేక యూజర్ ఐడి కూడా వచ్చింది. యూజర్ ఐడి ద్వారా నకిలీ పోర్టల్‌లో యూట్యూబ్ వ్యాపార ప్రకటనలు అవతలి వారికి పంపిస్తుండాలి. వాటిని సబ్స్క్రైబ్ చేసి రేటింగ్ ఇవ్వాలి ఇలా చేస్తే అధికంగా కమీషన్లు వస్తాయని నమ్మించారు. ముందుగా 10,000 డిపాజిట్ చేస్తే వీడియోలు పంపిస్తామన్నారు. తన వద్ద డబ్బు లేదనడంతో మేమే చెల్లిస్తామంటూ 10,000 కట్టినట్లు నకిలీ ఆధారాలు చూపించారు. అనిల్ కుమార్ అది నిజమని నమ్మి వారు పంపిన వీడియోలను సబ్స్క్రయిబ్ చేసి రేటింగ్ ఇచ్చాడు. 


మొదటగా 800 కమీషన్ రూపులో అనిల్ కుమార్ ఖాతాలో జమైంది. దీంతో అనిల్ కుమార్‌కు నమ్మకం ఏర్పడింది. ఇంకా ఎక్కువగా కమీషన్ రావాలంటే 10,000 కట్టమని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు. పేటీయం ద్వారా యూజర్ ఐడికి పదివేలు పంపాడు. సైబర్ నేరగాళ్లు వీడియోలు పంపారు కమీషన్ రూపంలో రెండోసారి 2,625లు వచ్చింది. తర్వాత సైబర్ నేరగాళ్లు ఒకేసారి 50 వేలు పంపమన్నారు. అనిల్ కుమార్ అలాగే పంపాడు 


చివరకు ఖాతా హోల్డ్‌లో పెట్టారు. మరోసారి 1,50,000 పంపమని డిమాండ్ చేయగా ఆ మొత్తాన్ని కూడా వాళ్ళ ఖాతాల్లో వేశారు. అయినప్పటికీ ఐడి హోల్డ్‌లోనే ఉంది. ఎందుకు నా ఐడి ఇంకా హోల్డ్‌లో పెట్టారు అంటూ అడగ్గా మరో నాలుగు లక్షల రూపాయలు పంపితే మొత్తం డిపాజిట్ అమౌంట్ మొత్తం తిరిగి పంపిస్తామని చెప్పారు. అంత డబ్బు కట్టలేనని చెప్పడంతో అనిల్ ఐడిని ఏకంగా బ్లాక్ చేశారు. ఐడిని బ్లాక్ చేయడంతో మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ఆధారంగా జిల్లా ఎస్పీ  అన్బురాజన్ ఆదేశాలతో సైబర్ నేరగాళ్ల జాడ కోసం టెక్నికల్ టీం సపోర్ట్ తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయే లావాదేవీలు అందులో కనుగొన్నారు. సుమారుగా 300కోట్ల పైగా ఈ సైబర్ నేరగాళ్లు నిరుద్యోగ యువత నుంచి డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.  పోలీసులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి మరింత లోతుగా విచారించాలని ఆదేశించారు. ఈ నేరగాల్లో ఆరుగురు ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారికి చెందిన 16 నకిలీ ఖాతాల నుంచి 35 కోట్ల 59 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. 14 కోట్ల 72 లక్షలను ఫ్రిజ్ చేయించారు. 


ఈ కేసు విచారణలో భాగంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో సుమారు 1550 ఫిర్యాదులు ఉండగా వీటిలో లావాదేవీల అంచనా వేస్తే సుమారు 300 కోట్లపై మాటనే అని వెల్లడించారు. ఈ కేసులో ఎలాగైనా ప్రధాన నిందితుణ్ని అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ  అన్బురాజన్ ఆదేశాలతో పోలీసు బృందం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లారు. టెక్నికల్ టీం ఆధారంగా కీలక నిందితుడు జమ్మాకశ్మీర్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన జిల్లా పోలీసులు సైబర్ నేరాల్లో కింగ్ పిన్ అయిన అనాయ తుల్లా అలియాస్ ఫర్హాన్‌ను అరెస్టు చేశారు. స్థానిక జమ్మూకశ్మీర్ పోలీసుల సహకారంతో అనాయ తుల్లాను స్థానిక కుల్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ట్రాన్స్‌ట్ వారెంట్ పై అనంతపురం జిల్లాకు తీసుకువచ్చి రిమాండ్ పంపారు