Anand Mahindra: మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ట్విటర్‌లో ఆయన ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన కంటెంట్‌ను, వైరల్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు. సామాన్యుడి టాలెంట్‌ను గుర్తిస్తూ, ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. తన అభిప్రాయాలను ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఓ యువతి టాలెంట్‌కు ఇంప్రెస్ అయ్యారు ఆనంద్ మహీంద్రా. ఏకంగా తన కంపెనీలో జాబ్ ఇస్తానంటూ ఆ యువతికి ఆఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ యువతి టాలెంట్ ఏంటో తెలుసుకుందాం.


స్టాప్లర్ పిన్‌తో కారు తయారీ...


సామాన్యుడి ప్రతిభను గుర్తించే వారిలో ఆనంద్ మహీంద్రా ముందంజలో ఉంటారు. ఎలాంటి సంకోచం లేకుండా కామన్ మ్యాన్ ప్రతిభను మెచ్చుకోవడమే కాకుండా వారి టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ స్టాప్లర్ పిన్స్ సహాయంతో ఓ అద్భుతమైన కారు తయారుచేసింది. ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆమె ఈ పిన్స్‌ను అతికించడానికి గమ్, ఫెవికల్, హాట్ గ్లూ వంటివి ఏవీ ఉపయోగించలేదు. పొడవుగా ఉన్న స్టాప్లర్ పిన్స్‌ను ఒక దానిలో ఒకటి జొప్పిస్తూ వాటిని కంప్రెస్ చేసి బండి చక్రాలు తయారుచేసింది. ఆ తరువాత ఇదే విధంగా పిన్స్‌ను సెట్ చేసి వెహికల్ సీట్‌ను తయారుచేసింది. రెండింటినీ అమర్చడానికి కూడా గమ్ యూజ్ చేయలేదు. వాహనాన్ని తయారుచేసే ప్రక్రియ చూస్తే అంతా ఓ పజిల్ లాగా ఉంది. అయితే తాజాగా ఈ వీడియో ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ మహిళ ప్రతిభకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ముగ్దుడైపోయాడు.






యువతికి జాబ్ ఆఫర్...


ట్విట్టర్ లో వీడియో షేర్ చేసిన ఆనంద్ర మహీంద్రా ‘ అంత సింపుల్‌గా ఉన్న స్టాప్లర్ పిన్స్‌తో ఇంత క్రియేటీవ్‌గా ఎలా ఆలోచించగలిగింది ? ఇది చాలా సృజనాత్మకమైనది. ఆమె నిజంగా కార్ల కంపెనీలో పని చేయాలని అనుకుంటే మేము ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం’ అని అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా మహిళ ప్రతిభకు ఇంప్రెస్ అవుతున్నారు. 'ఆమె టెస్లా కార్ల కంపెనీలో డిజైనర్ ఏమో అనిపిస్తోంది' అంటూ ఒకరు సరదాగా సందేహం వ్యక్తం చేశారు. దీనికి చాలా ఓర్పు అలాగే దండిగా స్టాప్లర్ పిన్స్ కావాలి అని మరొకరు అన్నారు. నిజమే నిజంగా చాలా అద్భుతంగా ఉంది అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఆ మహిళకు జాబ్ ఆఫర్ దొరకడం సంతోషకరం అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆనంద్ర మహీంద్రా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.