భారత దేశం అధ్యక్షతన దిల్లీలో నిర్వహించిన జీ 20 సదస్సు ఎంతో ఉత్సాహంగా ముగిసింది. జీ 20 శిఖరాగ్ర సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించిందని అమెరికా ప్రశంసించింది. ఇది సంపూర్ణ విజయం అని అమెరికా పేర్కొంది. సోమవారం అమెరికాలో జరిగిన రోజువారీ ప్రెస్‌ కార్యక్రమంలో విలేకరులు జీ20 సదస్సు గురించి ప్రశ్నించగా యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ సమాధానమిచ్చారు. జీ20 సంపూర్ణంగా విజయవంతమైందని తాము కచ్చితంగా నమ్ముతున్నామని తెలిపారు. జీ 20 అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్‌. ఇందులో రష్యా, చైనా కూడా సభ్యులుగా ఉన్నాయి.


ఈ సదస్సుకు రష్యా హాజరుకాకపోవడంపై ప్రశ్నించగా.. ఇందులో విభిన్నమైన అభిప్రాయాలు కలిగిన సభ్యులు ఉన్నారు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపునిచ్చే డిక్లరేషన్‌ను ఈ సదస్సు విడుదల చేయగలిగిందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఆ సూత్రాలను ఉల్లంఘించకూడదు అనేది ప్రధాన అంశమని, ఎందుకంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అదే కారణమని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన డిక్లరేషన్‌ అని భావిస్తున్నట్లు మిల్లర్‌ పేర్కొన్నారు. రష్యా పేరు ప్రస్తావించకుండా, జీ 20 సభ్యదేశాలు బాలి డిక్లరేషన్‌ను గుర్తు చేసుకున్నట్లు తెలిపారు. యూఎన్‌ చార్టర్‌ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని అన్నారు. ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, ఎల్లప్పుడూ ఉండే శాంతి కోసం దేశాలు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రాంతాలను స్వాధీనం చేసుకునే బెదిరింపులు, బలప్రయోగాలకు దూరంగా ఉండాలని సభ్య దేశాలు గుర్తు చేసినట్లు తెలిపారు.


ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించిన బాలిలో జరిగిన చర్చను ప్రస్తావించారు. ఐరాస భద్రతా మండలి, ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాలను తాము పునరుద్ఘాటించినట్లు తెలిపారు. అన్ని దేశాలు వాటికి అనుగుణంగా వ్యవహరించాలని నొక్కి చెప్పినట్లు పేర్కొన్నారు. యూఎన్‌ చార్టర్‌కు అనుగుణంగా ఏదైనా దేశం ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం, రాజకీయ స్వతంత్రానికి వ్యతిరేకంగా ప్రాదేశిక స్వాధీనం కోసం బెదిరింపులు, బలప్రయోగాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలిపారు. అణ్వాయుధాల బెదిరింపులు, ఉపయోగం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.


డిక్లరేషన్‌లో ఏముంది..?


"ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలు ఈ అశాంతి కారణంగా ఎంతగా నలిగిపోతున్నారో మేం అర్థం చేసుకోగలం. వాళ్లపై యుద్ధ ప్రభావం ఏ మేర ఉంటుందో కూడా అంచనా వేయగలం. ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో మేమంతా ఒక్కటిగానే ఉన్నాం. గతేడాది బాలిలో ఏ తీర్మానాలైతే చేశామో వాటికి కట్టుబడి ఉన్నాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాలకూ కట్టుబడే ఉంటాం. యూఎన్ ఛార్టర్‌కి అనుగుణంగా నడుచుకుంటాం. ఏ దేశంలో అయినా ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నా, భూభాగాల ఆక్రమణలు జరుగుతున్నా కచ్చితంగా మిగతా దేశాలు ఖండించాలని అందులో స్పష్టంగా రాసుంది. ఈ పరిస్థితులకు తగ్గట్టుగానే జాయింట్ డిక్లరేషన్‌లో పలు అంశాలు ప్రస్తావించాం. ఇవి యుద్ధం చేసుకునే రోజులు కావు. One Earth,One Family,One Future థీమ్స్‌కి అనుగుణంగానే స్నేహపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది"


జీ20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీలో ఈ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సు నేపథ్యంలో భారతీయ సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.