Afghanistan Taliban Crisis: 'అఫ్గాన్- లగాన్'కి లింకేంటి.. తాలిబన్లపై భారత్ 'స్టాండ్' ఏంటి?

ABP Desam Updated at: 10 Sep 2021 06:38 PM (IST)
Edited By: Murali Krishna

అఫ్గానిస్థాన్ పై భారత్ కొత్త పాలసీ గురించి తెలుసా? అఫ్గాన్ కు బాలీవుడ్ హిట్ సినిమా లగాన్ కు ఓ లింకుంది.. అదేంటో తెలుసా?

అఫ్గాన్- లగాన్'కి లింకేంటి.. తాలిబన్లపై భారత్ 'స్టాండ్' ఏంటి?

NEXT PREV

అఫ్గానిస్థాన్ తో భారత్ కు చాలా బలమైన బంధం ఉంది. ముఖ్యంగా అఫ్గాన్ వాసులతో భారత్ స్నేహం ఈనాటిది కాదు. కానీ ప్రస్తుతం అదే అఫ్గాన్ వాసులు తాలిబన్ల పాలనలో మరోసారి బందీలైపోయారు. ముఖ్యంగా మహిళలపై తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. తమ హక్కుల కోసం పోరాడుతోన్న మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. మరి అఫ్గాన్ తో ఇన్నేళ్లు దోస్తీ చేసిన భారత్.. ఏం చేస్తుంది? అసలు తాలిబన్ల సర్కార్ పై భారత్ స్టాండేంటి?


తాలిబన్లకు నేరుగా పాకిస్థాన్ సాయం చేస్తుంది. ఇది భారత్ కు కాస్త ఇబ్బంది కలిగే విషయమే.. అలా అనీ అఫ్గాన్ వాసులను గాలికొదిలేసి భారత్ నాకెందుకులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే అఫ్గానిస్థాన్ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం. అందుకే అఫ్గానిస్థాన్ పై భారత్ ప్రస్తుతం వైఖరిపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టత ఇచ్చారు.


తాలిబన్లు లేదా తాలిబన్ సర్కార్ తో భారత ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.



అఫ్గాన్ ప్రజలతో భారత్ కు చారిత్రక బంధం ఉంది. వారితో మునుపటిలానే భారత్ సంబంధాలను కొనసాగిస్తుంది. ఇదే తరహాలో అఫ్గానిస్థాన్ పై భారత్ పాలసీ ఉంటుంది.                           -       జైశంకర్, భారత విదేశాంగ మంత్రి


ఈ సమాధానం బట్టి అఫ్గాన్ లో ఎలాంటి సర్కార్ ఉన్నా అక్కడి పౌరులతో భారత్ బంధం కొనసాగుతుందని జైశంకర్ చెప్పకనే చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కూడా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్ కు సమస్య వస్తే వెంటనే స్పందించే సరిహద్దు దేశం భారత్ మాత్రమేనని, అక్కడి ప్రజలు భారత్ స్నేహితులని ఆయన స్పష్టం చేశారు.


ఇటీవల దోహాలో తాలిబన్లతో భారత్ జరిపిన చర్చల్లో కూడా ఇదే స్పష్టమైంది. అఫ్గానిస్థాన్ ను ఆక్రమించి సర్కార్ ఏర్పాటు చేసిన తాలిబన్లను, అమాయకులైన అక్కడి పౌరులను భారత్ వేరువేరు కోణాల్లో చూస్తోంది. ఎందుకంటే ఇటీవల చర్చల్లో కూడా తాలిబన్లు.. అఫ్గాన్ లో ఉన్న పౌరుల క్షేమం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పాస్తున్ వర్గం పరిస్థితి ఏంటో కూడా వెల్లడించలేదు. అఫ్గాన్ మాజీ అధ్యక్షులు హమిద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీ ఈ వర్గానికి చెందినవాళ్లే. 


లగాన్ సీడీలు..


అఫ్గానిస్థాన్.. భారత్ కు పెట్టుబడి వేదిక కాదని ఇప్పటికే చాలాసార్లు జైశంకర్ అన్నారు. వారితో బంధం గురించే ఎక్కువగా మాట్లాడారు. 2001 నవంబర్ 21న తాలిబన్లు గద్దె దిగిన సమయంలో ప్రత్యేక రాయబారి సతీశ్ లాంబా నేతృత్వంలో భారత బృందం కాబూల్ వెళ్లింది. ఆ సమయంలో భారత బృందం ఎయిర్ క్రాఫ్ట్ లో అప్గాన్ వాసులకు ప్రత్యేక బహుమతిని తీసుకువెళ్లింది. ఆ సమయంలో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన 'లగాన్' చిత్రం డీవీడీలను అఫ్గాన్ వాసులకు పంచిపెట్టారు. ఇప్పటికీ బాలీవుడ్ మూవీలను అఫ్గాన్ వాసులు బాగా ఇష్టపడతారు.


20 ఏళ్లలో..


గత 20 ఏళ్లలో అఫ్గాన్ లో భారత్ పెట్టిన పెట్టుబడులు, చేసిన అభివృద్ధి అంతాఇంతా కాదు. దాదాపు రూ.22 వేల కోట్లు అఫ్గాన్ లో ఖర్చు పెట్టింది భారత్. 


అఫ్గాన్ లో భారత్ చేసిన నిర్మణాలు..



  1. సల్మా డాం.. దీనిని హెరాత్‌ ప్రాంతంలో నిర్మించారు. 'అఫ్గాన్- ఇండియా ఫ్రెండ్ షిప్ డ్యాం' అని దీనిని పిలుస్తారు. ఇందుకోసం అయిన ఖర్చు దాదాపు 2వేల కోట్లు. 

  2. జరాంజ్-దెలారాం హైవే.. అఫ్గాన్‌లోని 218 కిలోమీటర్లలో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ వ్యాపార కోణంలో చాలా కీలకం. ఈ హైవే.. ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్న చార్‌బాహర్ ఎయిర్‌పోర్ట్ నుంచి అఫ్గాన్ లోని ప్రముఖ జాతీయ రహదారిని నేరుగా కలుపుతుంది. ఈ హైవే కోసం దాదాపు 1100 కోట్ల ఖర్చు చేసింది భారత్. 

  3. అఫ్గానిస్థాన్ పార్లమెంట్.. కాబూల్‌లో ఉన్న పార్లమెంటు భవనాన్ని కూడా భారత్ యే నిర్మించింది. ఇందుకోసం రూ.670 కోట్లు ఖర్చు చేశారు.

  4. ఇంతే కాదు ఎన్నో ఆసుపత్రులు, గ్రంథాలయాలు, పాఠశాలలు.. ఇలా అఫ్గానిస్థాన్ లో భారత్ ఎంతో అభివృద్ధి చేసింది.


అంతా వృథానేనా..


తాలిబన్లు వచ్చిన తర్వాత భారత్ చేసిన అభివృద్ధి, పెట్టిన ఖర్చు మొత్తం వృథాగా మారింది. రూ. 22వేల కోట్ల ప్రజల డబ్బుకు, 20 ఏళ్ల విలువైన సమయానికి ఫలితం లేకుండా పోయింది. మరి ఇప్పుడు తాలిబన్లతో జాగ్రత్తగా ఉంటూ అఫ్గాన్ ప్రజలకు సాయం చేయడం భారత్ ముందున్న అతిపెద్ద సవాల్. 

Published at: 10 Sep 2021 06:37 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.