అమెరికా అధ్యక్షుడు, లేదా ఆయన కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరి చంపేందుకు కుట్ర పన్నారన్న కేసులో 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ అనే తెలుగు సంతతికి చెందిన కుర్రాడు అరెస్టు అయ్యాడు. యూహాల్ అనే పేరుతో ఉన్న ట్రక్‌లో సాయి వర్షిత్‌ వైట్ హౌస్ వద్ద కలకలం రేపాడు. అక్కడ ఉన్న బారికేడ్స్‌ను ట్రక్‌తో ఢీ కొట్టి వైట్‌హౌస్‌లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు.


సోమవారం రాత్రి 9:40 సమయంలో మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ లాఫాయెట్ పార్క్‌కు సమీపంలో ఉన్న హెచ్ స్ట్రీట్ 1600 బ్లాక్‌లోని బోలార్డ్‌లపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రిపోర్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే U.S. పార్క్ పోలీసులు, U.S. సీక్రెట్ సర్వీస్ యూనిఫాం విభాగం అధికారులు అక్కడకు చేరుకున్నారు. దాడి చేసిన సాయి వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.


అతన్ని విచారిస్తే అమెరికా అధ్యక్షుడిని , వైస్‌ ప్రెసిడెంట్‌ను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ చంపేందుకు కుట్ర పన్నినట్టు తెలిసిందని పోలీసులు అభియోగాలు మోపారు. సాయి వర్షిత్‌ను అరెస్టు చేసిన సమయంలో ట్రక్‌లో నాజీ జెండాను గుర్తించినట్టు పోలీసులు వివరించారు. అమెరికా అధ్యక్షుడిపై దాడికి ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్టు ఒప్పుకున్నాడని చెబుతున్నారు.  


ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేయడం, వెహికల్‌ను నిర్లక్ష్యంగా నడపడం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లేదా వారి కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడం, కిడ్నాప్ చేయడం లేదా హాని కలిగించడం, ప్రభుత్వం ఆస్తిని నాశనం చేయడం, చట్టాన్ని అతిక్రమించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు.






సాయి వర్షిత్‌ మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్నట్టు  తెలిసింది. గ్రేటర్ సెయింట్ లూయిస్ ప్రాంతంలోని మార్క్వేట్ సీనియర్ హై స్కూల్‌లో 2022లో డిగ్రీ పూర్తి చేశాడు. లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేసిన వివరాల ప్రకారం సాయి వర్షిత్‌ డేటా అనలిటిక్స్ కోర్సు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అందులో సాయి వర్షిత్ ఇలా రాసి పెట్టాడు..."నాకు ప్రస్తుతం ఎటువంటి జాబ్‌ ఎక్స్‌పీరియన్స్ లేదు. అందుకే ఉద్యోగ కోసం వెతుకుతున్నారు. అక్కడ నేను ఎక్స్‌పీరియన్స్ సంపాదిస్తాను. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజ్‌ల కోర్సులు చేశాను." అని పేజీలో పేర్కొన్నాడు.






ప్రమాద స్థలం నుంచి నాజీ జెండాను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సాయి వర్షిత్‌ సెయింట్ లూయిస్ నుంచి డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి  నేరుగా వైట్ హౌస్ వైపు వెళ్లే ముందు ట్రక్కును అద్దెకు తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ట్రక్‌తో ఢీ కొట్టుకొని వైట్‌ హౌస్‌లోపలికి వెళ్లేలా ప్లాన్ చేశాడు కానీ అతన్ని మొదటి బారికేడ్ల వద్దే పోలీసులు అరెస్టు చేశారు. 


బారికేడ్లను ఢీకొట్టిన తర్వాత ట్రక్‌ నుంచి బయటకు వచ్చి స్వస్తిక్‌ గుర్తు ఉన్న జెండా ఊపడం ప్రారంభించాడట. ట్రక్ నుంచి నల్లని బ్యాక్‌ప్యాక్, డక్ట్ టేప్ రోల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కు కార్గో ప్రాంతం ఖాళీగా కనిపించింది.