Indian Employees Job Exchange: 


హై శాలరీ జాబ్‌ వద్దు..


జాబ్ లేకపోతే ఓ బాధ. ఉంటే మరో బాధ. పోనీ ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేసుకుందామా అంటే కట్టాల్సిన EMIల చిట్టా కనిపించి ఆగిపోతారు. నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం చేసే వాళ్లు తీవ్రమైన ఒత్తిడితో కుంగిపోతున్నారు. లక్షల కొద్ది జీతాలు వస్తున్నా ప్రశాంతత దొరకడం లేదు. పని గంటలు పెరుగుతున్నాయి. ఇదంతా తట్టుకోలేకే కొత్త ట్రెండ్‌కు తెర తీసేందుకు రెడీ అయిపోతున్నారు. అదే జాబ్ ఎక్స్‌ఛేంజ్ (Job Exchange).అంటే హై శాలరీ ఉన్న ఉద్యోగానికి బదులుగా తక్కువ జీతమున్న ఉద్యోగం చేయడం అన్నమాట. యూకేకు చెందిన ఓ కంపెనీ చేసిన సర్వేలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. దాదాపు 88% మంది ఇండియన్ ఎంప్లాయీస్ జాబ్ ఎక్స్‌ఛేంజ్‌కు ఆసక్తి చూపుతున్నారని తేలింది. కేవలం మానసిక ఆరోగ్యం కోసం హైయెస్ట్ శాలరీ ఉన్న జాబ్‌ను వదులుకుని, దానికి బదులుగా తక్కువ జీతమున్న ఉద్యోగం ఎంపిక చేసుకునేందుకు రెడీగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇండియాలో దాదాపు 25% మంది వీకెండ్ తరవాత పని మొదలు పెట్టేందుకు చాలా యాంక్సిటీగా ఫీల్ అవుతున్నట్టు చెప్పారు. దాదాపు 26% మంది రోజు పూర్తయ్యేలోగా ఎగ్జాస్ట్ అయిపోతున్నట్టు వివరించారు. కరోనా తరవాత చాలా మంది మెంటల్ హెల్త్‌పై శ్రద్ధ వహిస్తున్నారని, ఎక్కువ జీతాలొచ్చే ఉద్యోగాల కన్నా ప్రశాంతత ముఖ్యమని భావిస్తున్నారని సర్వే వెల్లడించింది. శాలరీ స్ట్రక్చర్ మార్చేసి తక్కువ జీతాలిచ్చి, పని తక్కువ చేయాలని కోరుకుంటున్నారు. ఇంత ఆందోళనకు కారణం...పని గంటలు విపరీతంగా పెరగడం. దాదాపు 33% మంది భారత్‌లోని ఉద్యోగులు స్ట్రెస్‌ను తట్టుకోలేకపోతున్నామని చెప్పారు. 


10 దేశాల్లో ఇంటర్వ్యూ..


ఒత్తిడి కారణంగా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని 34% మంది చెప్పారు. 31% మంది ఉద్యోగులు తోటి వారితో మాట్లాడేందుకూ సమయం ఉండడం లేదని, 26% మంది ప్రొడక్టివిటీ పడిపోతోందని ఫిర్యాదు చేశారు. ఇప్పుడిలా కంప్లెయింట్‌లు చేసే ఉద్యోగులంతా అంతకు ముందు బాగా పని చేసిన వారేనని సర్వే చెబుతోంది. అయితే...రాను రాను పని ఒత్తిడి పెరుగుతుండటం వల్ల వాళ్ల ప్రియారిటీ మానసిక ప్రశాంతతకు మారిందని తెలిపింది. ఫ్యామిలీతో సమయం గడిపేందుకు కూడా ఉండటం లేదని చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వాళ్లతో కన్నా కంపెనీ మేనేజర్లతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి వస్తోందని వాపోతున్న వారూ ఉన్నారు. వర్క్‌లోడ్ పెరిగే కొద్ది "ఈ ఉద్యోగం అవసరమా" అని చాలా మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని సర్వే స్పష్టం చేసింది. మొత్తం 10 దేశాల్లోని 2,200 మంది ఉద్యోగులను ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీలోని ఎంప్లాయిస్‌పై సర్వే చేసింది. ఇండియాలోని 200 మంది ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. వేలాది మందిని ఒకేసారి తొలగిస్తున్నాయి. గూగుల్, మెటా, అమెజాన్ కంపెనీలు విడతల  వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సర్వే వెలుగులోకి వచ్చింది.  


Also Read: India - Afghanistan: అఫ్గాన్‌కు 20,000 మెట్రిక్‌ టన్నుల గోధుమలు పంపిస్తున్న భారత్‌!