27 tourists killed in Kashmir terror attack:  జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో జరిగిన టెర్రర్ దాడిలో 27 మంది పర్యాటకులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. పెహల్గాంలో పర్యాటకులు ఓ కొండ ప్రాంతం వద్ద ఉన్న చిన్న వ్యాపారుల దుకాణాల వద్ద ఉన్న సమయంలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పర్యాటకుల్ని బంధీలుగా తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఐడీ కార్డులను పరిశీలించి కాల్చి చంపారు. ఇరవై ఏడు మందిని చంపిన తర్వాత వారు మళ్లీ పర్వత సానువుల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాతే విషయం బయటకు తెలిసింది.  

 జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో లిడ్డర్ నది ఒడ్డున హెహల్గాం ఉంటుంది. హిమాలయాలలో 7,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంపై టూరిస్టులుప్రత్యేక ఆసక్తి చూపిస్తారు.  సహజ సౌందర్యం, సతత హరిత అడవులు, మంచు కొండలు, పచ్చని లోయలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది అమర్‌నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం కూడా. కొత్తగా పెళ్లి అయిన జంటలో ఒకరిని దారుణంగా హత్య చేశారు . ఐడీ కార్డ్ అడిగి చంపేశారని ఆ యువతి కన్నీరు మున్నీరవుతున్నారు.  

 మూడు రోజులకిందట కశ్మీర్‌ను "పాకిస్తాన్ జీవనాడి"  పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు.   మా కశ్మీరీ సోదరులను వారి వీరోచిత పోరాటంలో వదిలిపెట్టబోమని పాకిస్తాన్ జనరల్ స్పష్టం చేశారు.  ఆ క్రమంలోనే ఈ దాడి జరగడంతో పాకిస్తాన్ కుట్రగానే అంతా అనుమానిస్తున్నారు. . 

కాల్పులు జరిపిన టెర్రరిస్టుల కోసం బలగాలు వేట ప్రారంభించాయి. ఎవర్నీ వదిలేది లేదని..  కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అమిత్ షాతో మాట్లాడారు. అమిత్ షా శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు.