Transgenders Mass suicide attempt: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని నందలాల్‌పురా ప్రాంతంలో 24 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగి మాస్ సూసైడ్ ప్రయత్నం చేసి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అక్టోబర్ 15 రాత్రి జరిగింది.  వెంటనే వారిని మహారాజా యశ్వంత్ రావ్  ఆసుపత్రికి తరలించారు. 

ఈ సూసైడ్ ప్రయత్నానికి ప్రధాన కారణం రెండు  ట్రాన్స్‌జెండర్   గ్రూపుల మధ్య డబ్బు వివాదం , శత్రుత్వం అని పోలీసులు చెబుతున్నారు.   సప్నా గురు అలియాస్ సప్నా హాజీ అనే ట్రాన్స్‌జెండర్ లీడర్ , ఆమె అనుచరులు రాజా హష్మీ, అక్షయ్ కుమాయు, పంకజ్ జైన్‌లు ఈ 24 మందిని బెదిరించి, దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  గ్రూపులకు సంబంధించి  సేకరించిన డిపాజిట్ డబ్బు నుంచి తమ వాటా డిమాండ్ చేసినప్పుడు ఈ దాడి జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.  అక్టోబర్ 16న సప్నా హాజీని అరెస్ట్ చేశారు.  ఆమె అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు. దాడి, అపహరణ ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.  అక్టోబర్ 14న మరో ట్రాన్స్‌జెండర్ మహిళ  పంకజ్ జైన్, అక్షయ్ కుమాయుపై బ్లాక్‌మెయిల్, రేప్ ఆరోపణలతో మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మూడు నెలల క్రితం జరిగింది.  వీరు బాధితురాలి నుంచి రూ.1.5 లక్షలు దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

ఆసుపత్రిలో కూడా మరో ట్రాన్స్‌జెండర్ వ్యక్తి సూసైడ్ ప్రయత్నం చేసినా, పోలీసులు అడ్డుకున్నారు.  అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఇది రెండు గ్రూపుల మధ్య శత్రుత్వం వల్ల జరిగినదని  పోలీసులు ప్రకటించారు. . భిక్షాటన ప్రాంతాల విభజన, వాటాల సొమ్ముపంపిణీ వల్ల గొడవలు జరుగుతున్నాయన్నారు.  సప్నా హాజీ, రాజా హష్మీ అనే  ఇద్దరు ట్రాన్స్ జెండర్  గ్రూపుల్ని నడుపుతూ గొడవలకు కారణం అవుతున్నారు.                      

కొంత మంది  ట్రాన్స్ జెండర్లు కాకపోయినా అలా నటిస్తూ  నేరాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పోలీసులు దృష్టి పెట్టారు. ట్రాన్స్ జెండర్  కమ్యూనిటీ సభ్యులందరిపై సెక్యూరిటీ చెక్‌లు జరుగుతాయి. మెడికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు.