Shiv Sena: 'ఏ క్షణంలోనైనా సీఎం మార్పు జరగొచ్చు- శిందే వర్గంలో అసంతృప్తి'

ABP Desam   |  Murali Krishna   |  24 Oct 2022 04:29 PM (IST)

Shiv Sena: మహారాష్ట్రలో ఏ క్షణమైన సీఎం మార్పు జరగొచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సంచలన వ్యాఖ్యలు చేసింది.

(Image Source: PTI)

Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ ముఖచిత్రం మారనుందా? శివసేనలో తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న ఏక్‌నాథ్ శిందేకు షాక్ తగలనుందా? అవును.. శిందేకు షాకిచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు భాజపాలోకి జంప్ కొట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

22 మంది

సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో తాజాగా చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. శిందే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఠాక్రే వర్గం చెబుతోంది. ప్రస్తుతం శిందే నేతృత్వంలోని శివసేనలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 22 మంది భాజపాకు జై కొట్టనున్నట్లు ఆ కథనంలో వెల్లడించారు.

ఆయన ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా కోల్పోతారు. ఇది ప్రతి ఒక్కరికి అర్థమైంది. అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శిందే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ, అందుకు భాజపా నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్‌ ఎన్నికల్లో విజయం సాధించామని శిందే వర్గం చెప్పటం పూర్తిగా అవాస్తవం. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారిలో చాలా మంది భాజపాతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలనే శిందే ప్రకటిస్తున్నారు.                                                     -    ఉద్ధవ్ ఠాక్రే వర్గం

పోటీకి దూరం

అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని ఇటీవల భారతీయ జనతా పార్టీ (భాజపా) నిర్ణయం తీసుకుంది. భాజపా అభ్యర్థి మూర్జి పటేల్ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. 

 అంధేరి ఈస్ట్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని పోటీలో ఉన్న మా అభ్యర్థి మూర్జి పటేల్‌ను అధిష్ఠానం ఆదేశించింది. పోటీలో ఉంటే ఈ ఉప ఎన్నికలో మా గెలుపు ఖాయం. కానీ రాష్ట్రంలో భాజపా చాలా కాలంగా ఈ ఆనవాయితీని పాటిస్తోంది. మేము గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ మేము మా నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నాం. ఈ మేరకు దేవేంద్ర ఫడణవీస్ తీసుకున్న నిర్ణయం మంచిదే.                           "

-చంద్రశేఖర్ భవాన్‌కులే, మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు
 
అంధేరీ ఉప ఎన్నికలో శివసేన రెండు వర్గాలు నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. భాజపా అభ్యర్థి ముర్జీ పటేల్‌కు శివసేన శిందే వర్గం మద్దతు పలికింది. అయితే భాజపా అనూహ్యంగా తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. దీంతో శివసేన ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థిని రుతుజ లట్కే విజయానికి మార్గం సుగమమైంది. నవంబర్ 3న అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక జరగనుంది. 
 
Published at: 24 Oct 2022 04:24 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.