Gas Cylinder Blast in Rajendranagar Bakery: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendranagar)లోని ఓ బేకరీ వంటశాలలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్ జీ పోలీస్ స్టేషన్ (RG Police Stations) పరిధిలోని గగన్ పాడు కరాచీ బేకరీలో (Gaganpadu Karachi Bakery) ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు, బేకరీలో మిగిలిన సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తొలుత శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు రాజేంద్రనగర్ లోని పారిశ్రామిక వాడలో బేకరీ నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ దాదాపు 100 మంది పని చేస్తున్నారు. రోజూలానే ఉదయం ఆహార పదార్థాలను తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ పైప్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.


సీఎం దిగ్భ్రాంతి


మరోవైపు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా యూపీకి చెందిన వారే ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.


 


Also Read: KCR discharge : శుక్రవారం ఆస్పత్రి నుంచి ఇంటికి కేసీఆర్ - పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం !