Ram Gopal Varma's Vyuham movie review in Telugu: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌ దర్శకత్వం వహించిన 'వ్యూహం' పలు అడ్డంకులు దాటుకుని ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ జంటగా నటించారు. దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో వర్మ ఏం చెప్పారు? అనేది రివ్యూలో చూడండి. 


కథ (Vyuham Movie Story): హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీ సీఎం వీర శేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు మదన్ (అజ్మల్ అమీర్)ను ముఖ్యమంత్రి చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారు. ఆ ప్రతిపాదనను కాదని కాశయ్యను ఏపీకి సీఎం చేస్తుంది భారత్ పార్టీ మేడం. మదన్ చేపట్టిన ఓదార్పు యాత్ర సైతం ఆపమని చెబుతుంది. హైకమాండ్, భారత్ పార్టీని లెక్క చేయకుండా మదన్ ముందుకు వెళతాడు. వీసీపీ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళతాడు. దాంతో అతని మీద కేసులు, ఇన్వెస్టిగేషన్లు మొదలవుతాయి. 


తనపై వచ్చిన కేసులను ఎదుర్కొని, ప్రత్యర్థులను తట్టుకుని మదన్ ఎలా సీఎం అయ్యాడు? భార్య మాలతి (మానస రాధాకృష్ణన్), తల్లి జయమ్మ (సురభి ప్రభావతి), చెల్లెలు నిర్మల (రేఖా నిరోషా) నుంచి ఎటువంటి సహకారం లభించింది. తారా ఇంద్రబాబు నాయుడు (ధనుంజయ్ ప్రభునే), శ్రవణ్ కళ్యాణ్ (చింటూ) కలిసి ఏం చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Vyuham Movie Review): 'వ్యూహం' సినిమా ప్రారంభంలో కల్పిత కథ, పాత్రలతో తీశామని చెప్పినా సరే... కథ ఏమిటనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. మహి వి రాఘవ్ తీసిన 'యాత్ర 2' కథాంశం కూడా అదే. మరి, రెండు సినిమాల మధ్య వ్యత్యాసం ఏమిటి? అంటే... 'యాత్ర 2'లో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ సహా నారా లోకేష్, వైఎస్ షర్మిల పాత్రలు లేవు. రామ్ గోపాల్ వర్మ వాళ్లను తన సినిమాలో చూపించారు. షర్మిల పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు గానీ... మిగతా పాత్రలపై సన్నివేశాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? సినిమాలో ఏముంది? అనేది చూస్తే...


రామ్ గోపాల్ వర్మ టార్గెట్ ఏమిటనేది సోషల్ మీడియాలో ఆయన్ను ఫాలో అయ్యే వాళ్లకు ఈజీగా అర్థం అవుతుంది. 'వ్యూహం'లోనూ అంతే... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై తనదైన శైలిలో వర్మ సెటైర్లు వేశారు. తెలుగు దేశం, జనసేన పార్టీ వ్యతిరేకులతో పాటు వైసీపీ అభిమానులతో ఈలలు, చప్పట్లు కొట్టే సన్నివేశాలు ఉన్నాయి తప్ప... కథగా కొత్తదనం లేదు. కథతో పాటు ప్రయాణించే భావోద్వేగాలు అసలు లేవు.


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితంలో ప్రజలకు తెల్సిన విషయాలే వర్మ 'వ్యూహం'లోనూ కనిపించాయి. 2014 ఎన్నికల్లో తాను ఓడిపోతానని జగన్ మోహన్ రెడ్డికి తెలుసునని చెప్పడం తప్ప 'వ్యూహం'లో ప్రజలకు తెలియని కొత్త విషయాలు లేవు. ఆ సంగతి పక్కన పెడితే... లోకేష్ రూపాన్ని చూపించకుండా ఆయన విపరీతంగా తింటారన్నట్లు చూపించిన దృశ్యాలు వైసీపీ నాయకులు చేసే ఆరోపణలు నుంచి స్ఫూర్తి పొందినట్లు ఉంది. స్పూఫ్ తరహాలో ఆ సన్నివేశాలు ఉన్నాయి తప్ప సీరియస్‌నెస్ కనిపించలేదు. రెండు లక్షల పుస్తకాలు చదివానని పవన్ చెప్పిన వ్యాఖ్యలపైనా సెటైర్లు వేశారు. మెగా బ్రదర్స్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులు హర్షించేలా లేవు. పైగా, అభిమానులకు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. నిరాహార దీక్ష, తల్లి కుమారుల మధ్య సన్నివేశాల్లో ఎమోషన్ వర్కవుట్ కాలేదు.


'వ్యూహం' కథ, కథనం, సన్నివేశాలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేలా లేవు. బాలాజీ అందించిన పాటలు వైసీపీ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. 'రావాలి జగన్, కావాలి జగన్' అంటూ ఓ పాట మధ్యలో వినిపించడం మంచి ఆలోచన. థియేటర్లలో వైసీపీ  అభిమానుల్లో జోష్ నింపుతుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కథకు తగ్గట్టు ఉన్నాయి. ఆనంద్ నేపథ్య సంగీతం ఓకే. దాసరి కిరణ్ కుమార్ చేసిన ఖర్చు తెరపై కనబడుతోంది.


Also Read: మదనే జగన్, శ్రవణే పవన్ - వర్మ 'వ్యూహం'లో పేర్లు మారాయ్, ఎవరి క్యారెక్టర్ ఏదో తెలుసుకోండి


'వ్యూహం' కథ ప్రేక్షకులకు తెలిసినదే. కథనం, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ, ఆర్టిస్టుల ఎంపికలో వర్మ మరోసారి పట్టు చూపించారు. నారా చంద్రబాబు, పవన్, చిరు, నాగబాబు, రోశయ్య, సోనియా తదితర పాత్రలకు ఆయా వ్యక్తుల రూపాన్ని పోలిన నటీనటుల్ని తెచ్చారు. చంద్రబాబు మేనరిజమ్స్ బాగా చూపించారు ధనుంజయ్ ప్రభునే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అజ్మల్ అమీర్ ఇమిటేట్ చేయలేదు. నటనలో జగన్‌ను గుర్తు చేసేలా కృషి చేశారు. భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ ఓకే. 


'యాత్ర 2' చూసిన ప్రేక్షకులకు 'వ్యూహం' కథ, కథనాల్లో ఎంత మాత్రం కొత్తదనం కనిపించదు. నారా చంద్రబాబు - లోకేష్, చిరంజీవి - పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేలా రూపొందించిన సన్నివేశాల్ని సాధారణ ప్రేక్షకులు సైతం హర్షించడం కష్టమే. అయితే... వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ వీరాభిమానులు విజిల్స్ వేసే మూమెంట్స్ సినిమాలో ఉన్నాయి. వాళ్లు హ్యాపీ థియేటర్లకు వెళ్ళవచ్చు.


Also Readఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ: వరుణ్ తేజ్ దేశభక్తి సినిమా హిట్టా? ఫట్టా?