Early Dinner Affects on Sleep and Digestion : టెక్ వ్యవస్థాపకుడు, దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్దతుదారు అయిన బ్రయాన్ జాన్సన్ ఇటీవల X లో ఒక పోస్ట్ ద్వారా ముందుగానే భోజనం చేయడం, మానసిక ఆరోగ్యం గురించి చర్చను లేవనెత్తారు. బయోహాకింగ్ రొటీన్, డేటా ఆధారిత జీవనశైలి ప్రయోగాలకు పేరుగాంచిన జాన్సన్.. ఎవరైతే తమ మానసిక శ్రేయస్సు ముఖ్యమనుకుంటున్నారో.. వారు నిద్రపోయే కొన్ని గంటల ముందే భోజనం చేసేయాలని సూచించారు. రాత్రిపూట తినడం మానుకోవాలని.. సాయంత్రం 5 గంటల తర్వాత ఆహారం తీసుకోకూడదనే నియమం పెట్టుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.

Continues below advertisement

Continues below advertisement

అయితే ఈ నియమం ఫాలో అవ్వాలంటే.. చాలా డౌట్స్ వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో..  ఈ అంశాలపై నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటో చూసేద్దాం.  

నిర్దిష్ట సమయం అవసరమా?

మణిపాల్ హాస్పిటల్లో చీఫ్ క్లినికల్ డైటీషియన్ అయిన శ్రీమతి నబనీత సాహా ప్రకారం.. మీరు సాయంత్రం 5 గంటలకు భోజనం చేయాలనే నియమాన్ని పాటించడంపై దృష్టి పెట్టకూడదని సూచిస్తున్నారు. దానికి బదులుగా చివరి భోజనం, నిద్రపోయే సమయానికి మధ్య తగినంత సమయం ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. చివరి భోజన సమయానికి, నిద్ర సమయానికి కనీసం 2-4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకే భోజనం చేయాలనే నియమం అందరికీ సరిపోకపోవచ్చని చెప్తున్నారు. దీనివల్ల ఆకలి నిద్రలేమికి కారణం అవుతుందని చెప్తున్నారు. ఎవరైతే రాత్రుళ్లు 8-9 గంటలకు నిద్రపోతారో.. వారికి సాయంత్రం 5 గంటలకు భోజనం చేసే నియమం బాగా సరిపోతుందని అన్నారు.  

రాత్రుళ్లు ఆలస్యంగా తింటే..

నిద్రపోయే సమయానికి దగ్గరగా ఆలస్యంగా తినడం వల్ల.. ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని సాహా అంటున్నారు. ఇది నిద్ర, జీవక్రియ, హార్మోన్లను విడుదల చేసే శరీర సహజ గడియారం అయిన కార్డియన్ రిథమ్​ను దెబ్బతీస్తుంది. అలాగే జీర్ణక్రియకు శక్తి అవసరమని, వేడిని ఉత్పత్తి చేస్తుందని.. ఈ ప్రక్రియను థర్మోజెనిసిస్ అంటారు. మంచి నిద్రలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గుతుంది. కానీ నిద్రపోయే ముందు ఎక్కువ తింటే.. జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటుంది. శరీరం వేడిగా మారి నిద్రపోవడం కష్టమవుతుంది. హార్మోన్ల సమతుల్యత కూడా ప్రభావితం కావచ్చు. ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించే భోజనం మెలటోనిన్, మానవ వృద్ధి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

కణజాల మరమ్మత్తు, కండరాల పునరుద్ధరణ, జీవక్రియ నియంత్రణకు ఈ హార్మోన్ చాలా అవసరం. ఎక్కువగా నిద్ర ప్రారంభ దశలో జరుగుతుంది. దీని కారణంగా నిద్రపోయే కనీసం రెండు నుంచి నాలుగు గంటల ముందు భోజనం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎసిడిటీ సమస్యలు కూడా భోజనం సమయం జీర్ణ ఆరోగ్యాన్ని కూడా నేరుగా ప్రభావం చేస్తుంది. కానీ ముఖ్యంగా ఎసిడిటీని గురిచేసేవారిపై ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మణిపాల్ హాస్పిటల్​లో మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ప్రసన్న కె.ఎస్. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల ఎసిడిటీ పెరుగుతుందని వివరిస్తున్నారు.

తిన్న వెంటనే పడుకున్నప్పుడు..

భోజనం చేసిన వెంటనే పడుకుంటే.. జీర్ణంకాని ఆహారం, కడుపులోని ఆమ్లం ఆహార నాళంలోకి తిరిగి ప్రవహిస్తుంది. గొంతు, నోటిలో రక్షణ ప్రతిస్పందనలు లేనప్పుడు.. ఊపిరితిత్తులు, గొంతు, ముక్కు దెబ్బతింటాయి. కొన్నిసార్లు నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది. అందుకే రాత్రి భోజనం, నిద్రకు కనీసం రెండున్నర నుంచి మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. అలాగే కాఫీ, టీ, నూనె పదార్థాలు, మసాలా ఆహారాలను రాత్రి సమయంలో తీసుకోకూడదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి మరింత ఎసిడిటీని పెంచుతాయి.

గట్ హెల్త్​పై ప్రభావం

శరీరం విశ్రాంతి కోసం సిద్ధమవుతున్నప్పుడు.. రాత్రి సమయంలో జీర్ణక్రియ సహజంగా నెమ్మదిస్తుంది. దీనిగురించి డాక్టర్ ప్రసన్న వివరిస్తూ.. రాత్రి సమయంలో కడుపు, పేగులు వాటి పనితీరును తగ్గిస్తాయి. ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోతే.. అది పేగులలో బ్యాక్టీరియా క్షీణతను పెంచుతుంది. ఈ ప్రక్రియ ఉబ్బరం, గ్యాస్​కు దారి తీస్తుంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అజీర్ణంతో బాధపడేవారు ఏమి చేయాలంటే..

GERD లేదా దీర్ఘకాలిక అజీర్ణంతో బాధపడుతున్న వ్యక్తులు వారి భోజనం సమయం, నిద్ర భంగిమల గురించి ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. రాత్రిపూట తేలికపాటి భోజనం, నిద్రపోయే ముందు రెండున్నర నుంచి మూడు గంటల ముందు తీసుకోవాలి. తల పైకి ఉండేలా ఎడమవైపు తిరిగి పడుకోవాలి. ఇది ముప్పై నుంచి నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉండాలని అని డాక్టర్ ప్రసన్న సూచిస్తున్నారు.