Centre Revokes Detention Of Sonam Wangchuk:   లడఖ్‌కు స్వయంప్రతిపత్తి , రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్‌పై మోపిన జాతీయ భద్రతా చట్టం  ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉపసంహరించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో లేహ్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన సమయంలో, ప్రజలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో వాంగ్చుక్‌ను అరెస్టే చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు ఆరు నెలల నిర్బంధం తర్వాత ఆయనపై జాతీయ భద్రతా చట్టంను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.                                    

లడఖ్‌లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి,  ఆ ప్రాంతంలోని స్టేక్‌హోల్డర్లతో అర్థవంతమైన చర్చలు జరపడానికి ఈ నిర్బంధాన్ని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత కొంతకాలంగా లడఖ్‌లో నిరసనలు, బంద్‌ల వల్ల విద్యార్థులు, వ్యాపారులు,  పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోతున్నాయని, సాధారణ స్థితిని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని హోం శాఖ స్పష్టం చేసింది. వాంగ్చుక్ ఇప్పటికే తన శిక్షా కాలంలో సగానికి పైగా పూర్తి చేశారని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనను విడుదల చేయడం సముచితమని ప్రభుత్వం భావించింది.

వాంగ్చుక్ అరెస్టును సవాలు చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు కోర్టులో వాదనలు వినిపిస్తూ, వాంగ్చుక్ యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని, నేపాల్, బంగ్లాదేశ్ తరహా ఆందోళనలకు పిలుపునిచ్చారని ప్రభుత్వం వాదించింది. అయితే, తాను ఎప్పుడూ హింసను ప్రేరేపించలేదని, హింస వల్ల లడఖ్ ఐదేళ్ల ప్రశాంతమైన పోరాటం  వృథా అవుతుందని తాను గతంలోనే స్పష్టం చేశానని వాంగ్చుక్ తరఫు న్యాయవాదులు వాదించారు.        

ప్రభుత్వ నిర్ణయాన్ని కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ వంటి సంస్థలు స్వాగతించినప్పటికీ, లడఖ్ ప్రజల ప్రధాన డిమాండ్లు ఇంకా నెరవేరలేదని పేర్కొన్నాయి. రాష్ట్ర హోదా,  ఆరో షెడ్యూల్ అమలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. వాంగ్చుక్ విడుదల తర్వాత లడఖ్ పరిపాలనలో, కేంద్ర ప్రభుత్వంతో జరిపే చర్చల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.