వాతావరణ పరిస్థితిలో మార్పు రావడంతో డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక మంది డెంగ్యూ జ్వరాన పడి చికిత్స పొందుతున్నారు. ఈడెస్ దోమ కాటు ద్వారా సంక్రమించే వైరల్ ఫీవర్ ఇది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి డెంగ్యూ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 100-400 మిలియన్ల ఇన్ఫెక్షన్లకి కారణమవుతుంది. డెంగ్యూ కేసులు, వాటి తాలూకు మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.


డెంగ్యూ లక్షణాలు


⦿ అధిక జ్వరం


⦿ తలనొప్పి


⦿ కళ్ళు నొప్పులు


⦿ వికారం


⦿ కీళ్ల నొప్పులు


⦿ అలసట


ఇవి సుమారు ఐదు రోజుల పాటు ఉంటాయి. లక్షణాలు కనిపించగానే చికిత్స తీసుకోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పీరియడ్ ముగిసే సమయానికి బీపీ పడిపోయి క్రిటికల్ కండిషన్ కి వెళతారు. ఊపిరితిత్తులు, పొత్తికడుపులో ద్రవం పేరుకుపోతుంది. దద్దుర్లు అభివృద్ధి చెందుతాయి. కొంతమంది రోగుల్లో రక్తస్రావం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే రోగిని అత్యవసరంగా హాస్పిటల్ లో చేర్పించాలి. లేదంటే ప్రాణానంతకం కావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు చెప్పిన విధంగా చేస్తే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఈ పరిస్థితులు తలెత్తితే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.


హాస్పిటల్ లో ఎప్పుడు చేరాలి?


⦿ రోగి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే


⦿ నిరంతర వాంతులు, అధిక జ్వరం


⦿ రోగికి రక్తస్రావం జరిగి పాలిపోయినట్టుగా కనిపించినప్పుడు


⦿ రోగి అవయవాలు చల్లగా మారిపోయి చలిగా అనిపించినప్పుడు


⦿ రక్తంలోని ప్లేట్‌లెట్స్ 40 వేలు కంటే బాగా తగ్గినప్పుడు


ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


డెంగ్యూ మనిషిలో ఉన్న శక్తినంత హరించి వేస్తుంది. శరీరం బాగా నీరసించి అలసటగా కనిపిస్తారు. మళ్ళీ తిరిగి కోలుకునేందుకు మంచి ఆహారం పెట్టాలి. పప్పు వంటి తేలికపాటి ఆహారం ఇవ్వాలి. అరటి పండు, పప్పు, ఇడ్లీ, దానిమ్మ, యాపిల్, గింజలు వంటి పౌష్ఠికాహారం తీసుకోవాలి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. మొబైల్, టీవీలకు దూరంగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలు నిద్ర అవసరం. ఎంత ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. బొప్పాయి ఆకు రసం తీసుకుంటే జ్వరం తగ్గుతుందని ఇంటి చిట్కాలు పాటించడం కరెక్ట్ కాదు. ఇంటి చిట్కాలు ఒక్కోసారి మంచి కంటే ఎక్కువ హనీ చేస్తాయి.


బొప్పాయి, గిలోయ్ వంటి రసాలు తీసుకుంటే డెంగ్యూ సమయంలో ప్లేట్ లెట్ కౌంట్ పడిపోకుండా ఉంటుందని చెప్తుంటారు. కానీ ఈ ఆకు రసం తాగడం వల్ల వాంతులు అయ్యే అవకాశం ఉంది. అంతర్లీనంగా నిర్జలీకరణానికి దారి తీయవచ్చు. వీటికి బదులు తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. బొప్పాయి రసం తాగడానికి బదులు రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయల సూప్, కొబ్బరి నీళ్ళు పుష్కలంగా తీసుకోవాలి.


 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే