నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరం ఆహారం లేకుండా వారం పాటు ఉండగలదేమో కానీ నీళ్ళు తాగకుండా అసలు రోజు కూడా ఉండలేరు. శరీరం డీ హైడ్రేట్ అవకుండా ఉండాలంటే తప్పనిసరిగా నీళ్ళు తాగాలి. రోజుకి కనీసం 3 లీటర్లు నీళ్ళు తాగలని వైద్యులు చెబుతూ ఉంటారు. సరిపడినంత నీరు తగాకపోతే చర్మం నిర్జీవంగా కనిపిస్తూ పొడి బారిపోతుంది. అంతే కాదు కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే మంచి నీళ్ళు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతారు. అయితే భోజనం మధ్యలో నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? తినే టైమ్ లో ఏయే సందర్భాల్లో నీళ్ళు తాగాలి అనే దాని మీద అవగాహన తప్పకుండా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.


భోజనం మధ్యలో నీళ్ళు తాగడం వల్ల మనం తీసుకునే ఆహారం జీర్ణం చేయడం కష్టం అవుతుందని వినే ఉంటారు. టాక్సిన్స్ పేరుకుపోవడానికి అవకాశం ఉంటుందని అంటారు. ఆయుర్వేదం కూడా భోజనం మధ్యలో నీరు తీసుకోకూడదనే చెప్తోంది. భోజనంతో పాటు నీరు తాగడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను శోషించడం అనేది పలుచన చేస్తుంది. దాని వల్ల ఆహారం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది.


ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం వల్ల కూడా దాహంగా అనిపిస్తుంది. ఫైబర్ సహజంగా నీటిని ఎక్కువగా తీసుకుంటుంది. సలాడ్ తిన్న తర్వాత దాహం ఎక్కువగా అనిపిస్తుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తీసుకోకపోవడమే మంచిది.


ఎలాంటి నీరు తాగుతున్నారు?


భోజనం చేసే ముందు లేదా మధ్యలో మీరు ఎలాంటి నీటిని తాగుతున్నారు అనేది కూడా ముఖ్యమే. ఆల్కలిన్ వాటర్ తాగడం వల్ల పొట్టలోని ఆమ్లాలు మరింత తటస్థీకరించేలా చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ వంటి ఆమ్లాలు ఉన్న నీటిని సిప్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం చేసిన తర్వాత నీళ్ళు తాగడం తాగకపోవడం అనేది శరీర రకం మీద ఆధారపడి ఉంటుంది. అవసరం లేదనుకుంటే నీటిని కొద్దిసేపు ఆగిన తర్వాత తాగడం మంచిది.


కొంతమంది నిలబడి నీళ్ళు తాగకూడదు అని అంటారు. దాని వల్ల ఆ నీళ్ళు నేరుగా బ్లాడర్ లోకి వెళ్ళిపోయి అతిగా మూత్ర విసర్జన చేయడం జరుగుతుందని చెప్తారు. భోజనం మధ్యలో నీరు తాగకుండా ఉండటమే మంచిది అనేందుకు కూడా సైంటిఫిక్ గా ఎటువంటి అధ్యయనాలు లేవని నిపుణులు చెప్తారు.


ఎప్పుడు నీళ్ళు తాగాలి?


నిద్రలేచిన వెంటనే: ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నీటిని తాగడం ఉత్తమం. శరీర అంతర్గత అవయవాలు పని చెయ్యడంలో సహాయపడుతుంది. మీ మొదటి భోజనానికి ముందు నీళ్ళు తాగడం వల్ల కడుపులో ఉన్న వ్యర్ధాలను కూడా తొలగిస్తుంది.


స్నానానికి ముందు: రక్తపోటుని తగ్గించడంలో సహాయపడతానికి స్నానానికి ముందు ఒక గ్లాసు నీటిని తాగితే మంచిది. కొంత మందికి వేడి నీటితో స్నానం చేసిన తర్వాత నీళ్ళు తాగాలని కూడా అనిపిస్తుంది.


భోజనానికి ముందు: జీర్ణక్రియకు సహాయపడటానికి భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు త్రాగాలి. భోజనానికి ముందు లేదా తర్వాత ఎక్కువగా నీళ్ళు తాగకూడదు. ఎందుకంటే నీరు జీర్ణ రసాలను పలచన చేస్తుంది. ఆహారం తీసుకున్న ఒక గంట తర్వాత నీరు త్రాగడం వల్ల శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ చూడగానే ఎందుకు నోరూరిపోతుందో తెలుసా?


Also read: ఎండలో ఫోన్ చూస్తున్నారా? ఇక భవిష్యత్తులో ఏమీ చూడలేరు, ఎందుకంటే..