‘మీ ఫేవరేట్ ఫుడ్ ఏంటి?’ అని ఎవరినైనా అడిగి చూడండి. ఎంత మందిని అడిగినా అందులో సగం మంది కన్నా ఎక్కువ చెప్పేది బిర్యానీనే. ఆ వాసనకే నోరూరిపోతుంది. ఇక తింటే స్వర్గమే గుర్తొస్తుంది. బిర్యానీ కన్నా టేస్టీ వంటకమేదో చెప్పండి... మీ దగ్గర జవాబు ఉండడం కష్టమే. మసాలాలు దట్టించి, కుంకుమ పూల పాలను గుమ్మరించి, లేత మాంసాన్ని ఉడికించి చేసే టేస్టీ వంటకం బిర్యానీ. పొరలు పొరలుగా వేస్తూ వండే దమ్ బిర్యానీ రుచి మరిచిపోవడం చాలా కష్టం. అందుకే ఇప్పటికీ ఆన్ లైన్ ఆర్డర్లోల బిర్యానీ ఆర్డర్లే ఎక్కువ. 


మొఘలుల బహుమతి
బిర్యానీ మనది కాదు. ఈ విషయం ఎంతో మందికి తెలుసు. పెర్షియన్ సంస్కృతి  నుంచి పాకిన  ప్రభావం. వారి వంట అలవాట్లు భారతదేశం అంతటా దాదాపు వ్యాప్తి చెందాయి.  మొఘలుల మన దేశానికి వచ్చి మనకి ఇచ్చిన అద్భుత బహుమతి బిర్యానీ అని చెప్పుకోవచ్చు. ఆ రుచికి దాసోహం అయిపోయరు భారతదేశ ప్రజలు. ప్రతి వారం, వీలైతే ప్రతి రోజూ బిర్యానీ తినే వాళ్లు ఉన్నారు. ఫుడ్ అగ్రిగేటర్  స్విగ్గీ మరోసారి బిర్యానీని ఈ సంవత్సరంలో "అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం"గా  ప్రకటించింది. గురువారం వార్షిక ట్రెండ్స్ కు సంబంధించిన నివేదిక ‘హౌ ఇండియా స్విగ్గి 20
22' ఎడిషన్లో ప్రచురించింది. 


నిమిషానికి  137
బిర్యానీ తన దమ్ము చూపిస్తోంది. ఏకంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయి. అంటే సెకనుకు 2.28 ఆర్డర్లు అంటూ ఆ నివేదికలో రాసుకొచ్చింది. అంటే ఏ స్థాయిలో బిర్యానీ అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం స్విగ్గీలోనే ఇలా అమ్ముడుపోతుంటే ఇక జొమాటో వంటి ఇతర ఫుడ్ అగ్రిగేటర్లలోని అమ్మకాలు చూస్తే బిర్యానీ ఇంకా ఎక్కువగానే అమ్ముడవుతున్నట్టే లెక్క. 


తరువాత...
బిర్యానీ తరువాత అధికంగా అమ్ముడవుతున్న అయిదు వంటకాలు ఏమిటో కూడా ప్రకటించింది స్విగ్గీ. మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్. 






అదే టాప్
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో తినేవి మినహాయిస్తే స్నాక్స్ టైమ్‌లో అధికంగా అమ్ముడవుతున్నది సమోసాలు.  స్విగ్గీలో ఈ ఏడాది దాదాపు 40 లక్షల సమోసా ఆర్డర్లు వచ్చినట్టు చెప్పింది స్విగ్గీ. తరువాత 22 లక్షల దాకా పాప్ కార్న్ ఆర్డర్లు వచ్చాయి. అయితే ఈ రెండింటి ఆర్డర్ కూడా రాత్రి పదిగంటల తరువాత రావడం గమనార్హం. ఇక సమోసా తరువాత పావ్ భాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్ స్టిక్లు, హాట్ వింగ్స్, టాకోలు తరువాతి వరుసలో ఉన్న స్నాక్స్. 


స్వీట్?
తీపి పదార్థాలలో గులాబ్ జామూన్ అధికంగా ఆర్డర్లు అందుకుంది. తరువాత రసమలై, చోకో లావా కేక్‌లు ఉన్నాయి. 


చికెన్ ఎక్కువ
ఆర్డర్లలో చికెన్ ఐటెమ్ష్ ఎక్కువగా వచ్చినట్టు చెప్పింది స్విగ్గీ. దాదాపు 29.86 లక్షల ఆర్డర్లు చికెన్‌కు సంబంధించినవే. ఇక ఎక్కువగా ఆర్డర్లు వచ్చిన నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 


Also read: గాయాల నుంచి రక్తస్రావం త్వరగా ఆగాలా? అయితే ఈ ఆహారాలు తినండి