కేరళలో పదహారేళ్ల అమ్మాయి దేవానంద మరణం మరో కొత్త అంటువ్యాధిని వెలుగులో తెచ్చింది. ఆమె కాసరగోడ్ జిల్లాలోని ఓ ఫుడ్ స్టాల్ వద్ద ‘షావర్మా’ అనే వంటకం ఆరగించింది. ఆమెతో పాటూ మరో యాభైమంది విద్యార్థులూ తిన్నారు. వారంతా అనారోగ్యం పాలయ్యారు. ఇక ఈ పదహారేళ్ల అమ్మాయి తిన్న రెండు రోజులకే మరణించింది. ఆమె మరణానికి కారణం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అని తెలిసింది. అందులోనూ షిగెల్లా బ్యాక్టిరియా సోకిన ఆహారం తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు సీనియర్ జిల్లా ఆరోగ్యశాఖ అధికారి. మీడియా వచ్చిన కథనాలను చూసిన కోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. రెస్టారెంట్ యజమాన్యంపై కేసు నమోదు చేయడాలని, ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వాలని కోరింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా ఎన్నో ప్రశ్నలు సంధించింది. ఇప్పుడు  కేరళలో షిగెల్లా బ్యాక్టిరియాలో ఒకరి నుంచి ఒకరికి సోకుతుందేమోనన్న భయం అలుముకుంది.  

  
ఏంటి షిగెల్లా బ్యాక్టిరియా?
అమెరికాలకు చెందిన ప్రఖ్యాత క్లినిక్ మాయో చెప్పిన ప్రకారం షిగెల్లా ఇన్ఫెక్షన్ అనేది షిగెల్లా అని పిలిచే బ్యాక్టిరియా వల్ల కలుగుతుంది. దీన్ని షిగెల్లోసిస్ అని కూడా అంటారు. నోటి ద్వారా ప్రవేశించి పేగులపై అధిక ప్రభావం చూపిస్తుంది. ఇది సోకిన వెంటనే విరేచనాలు మొదలవుతాయి. ఒక్కోసారి రక్త విరేచనాలు కూడా కావచ్చు. వాంతులు అవుతాయి. ఇది అంటు వ్యాధి. షిగెల్లా బ్యాక్టిరియా సోకిన ఆహారాన్ని తినడం వల్ల, ఆ బ్యాక్టిరియా సోకిన వ్యక్తి నుంచి కూడా పక్క వారికి ఇది సోకుతుంది. అందుకే చేతులు బాగా కడుక్కునే ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా మల మూత్ర విసర్జన తరువాత కచ్చితంగా చేతులు సబ్బుతో కడుక్కోమని సూచిస్తున్నారు. షిగెల్లా బ్యాక్టిరియా ఉన్న నీటిలో ఈత కొట్టినా కూడా ఇది వ్యాపిస్తుంది.


చికిత్స ఎలా?
తీవ్రమైన కేసుల్లో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించాల్సి రావచ్చు. చేయి దాటి పోతే మరణం కూడా సంభవించవచ్చు. తేలికపాటి కేసుల్లో మాత్రం ఇంట్లోనే ఉండి మందులు వాడాల్సి వస్తుంది. ముఖ్యంగా వైద్యులు షిగెల్లా బ్యాక్టిరియాను చంపడానికి యాంటీ బయటిక్స్ ను సూచిస్తారు. ఒక వారంలో బ్యాక్టిరియా బయటికి పోతుంది లేదా నాశనం అవుతుంది. షిగెల్లా వైరస్ శరీరంలోకి చేరాక రెండు రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. వారం రోజుల పాటూ గుర్తించకపోతే సమస్య తీవ్రంగా పెరుగుతుంది. 


ఇవే లక్షణాలు...
1. వాంతులు, విరేచనాలు
2. కడుపు నొప్పి
3. జ్వరం
4. వికారంగా ఉండడం


ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
షిగెల్లా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. బరువు తగ్గడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం, రక్త విరేచనాలు కావడం కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవాలి. జ్వరం 101 డిగ్రీల ఫారెన్ హీట్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాణాలకు ప్రమాదం అని గుర్తించండి. వెంటనే ఆసుపత్రిలో చేరండి. 


Also read: అప్పట్లో తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టేవారు, ఎందుకు? సైన్సు ఏం చెబుతోంది?



Read Also: ఆ తెగలో విచిత్రమైన ఆచారం, అమ్మాయి పుడితే వేశ్యగా మారుస్తారు