మొబైల్ ఫోన్స్‌తో ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలు ముడిపడి ఉన్నాయి. టాయిలెట్ సీటు కంటే మొబైల్ ఫోన్ పైన ఉండే బ్యాక్టీరియా ఎక్కువ అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇప్పుడు మరొక అధ్యయనం మొబైల్లో ఫోన్లు ఎక్కువగా మాట్లాడే వారికి హైబీపీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ వ్యక్తితో పోలిస్తే రోజుకు 30 నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం 12 శాతం ఉన్నట్టు చెబుతోంది అధ్యయనం.


ఈ అధ్యయనం తాలూకు వివరాలను యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురించారు. చైనాలోని గ్వాంగ్జౌ సదరన్ మెడికల్ యూనివర్సిటీలో నిర్వహించారు. మొబైల్ అధికంగా వాడడం వల్ల గుండె, శరీరం పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మొబైల్ లో మాట్లాడే నిమిషాల సంఖ్య గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. ఎక్కువ నిమిషాలు మాట్లాడితే గుండెకు చేటు జరిగే అవకాశం ఉందని అధ్యయనకర్తలు వివరించారు. అయితే కొంతమంది ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే సమస్య అనుకుని,  హెడ్ ఫోన్స్ లేదా బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడతారు. ఇలా చేయడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదని వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఫోన్. చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడినా హెడ్ ఫోన్స్, బ్లూటూత్ ఉపయోగంతో మాట్లాడినా కూడా అధిక రక్తపోటు వచ్చే ఛాన్సులు ఎక్కువే.


జనాభాలో దాదాపు మూడొంతుల మంది మొబైల్ ఫోన్‌ను కలిగి ఉన్నారు. పిల్లల్లో కూడా మొబైల్ ఫోన్ వాడటం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 30 ఏళ్ల నుండి 79 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న జనాభాలో 130 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రపంచంలో ముందస్తు మరణాలకు ఇది ప్రధాన కారణం. 


మొబైల్ ఫోన్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ విడుదలవుతుంది. ఇది తక్కువ స్థాయిలోనే ఉన్న రోజూ మాట్లాడటం వల్ల దీని ప్రభావం మన శరీరం పై, ఆరోగ్యం పై పడుతుంది. రక్త పోటు పెరుగుదలతో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ముడిపడి ఉంది. మొబైల్ ఫోన్ వినియోగం పై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కేవలం కాల్స్ మాట్లాడితేనే కాదు మెసేజ్ చేసుకుంటున్నా, గేమ్ ఆడుకుంటున్నా కూడా రక్తపోటు పై ప్రభావం పడుతుంది. 


హై బీపీ లేని వారికి కూడా మొబైల్ వాడటం వల్ల ఆ సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతోంది యూకే అధ్యయనం. బ్రిటన్లో రక్తపోటు లేని రెండు లక్షల మందిపై ఓ దీర్ఘకాల అధ్యయనాన్ని నిర్వహించారు. వారి వయసు 37 నుంచి 73 సంవత్సరాల లోపు వయసు. వారికి ఒక ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి... ఫోన్ వారు ఎంతగా ఉపయోగిస్తారో తెలుసుకున్నారు. వారానికి ఎన్ని గంటలు వినియోగిస్తారు, చేత్తో పట్టుకుని ఫోన్ మాట్లాడతారా లేక బ్లూటూత్, స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడతారా ఇలా రకరకాల ప్రశ్నావళిని అందించారు. అధిక బరువు,  రక్తపోటు కుటుంబ చరిత్ర, ధూమపానం,రక్తంలో గ్లూకోజ్ పెరగడం వీటన్నింటిని వారి ద్వారా తెలుసుకున్నారు. దాదాపు వారిని 12 ఏళ్ల వరకు ఫాలో అప్ చేశారు.  అధ్యయనం ప్రకారం పాల్గొన్న 13984 మంది 12 ఏళ్ల కాలంలో హైబీపీ బారిన పడ్డారు. వారు మిగతా వారితో పోలిస్తే అధికంగా మొబైల్ ఫోన్ వినియోగించినవారు. దీన్నిబట్టి ఫోన్ అధికంగా వాడేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. 



Also read: మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉన్న నీళ్లలో మునకలేస్తే ఆర్థరైటిస్ మాయం, ఇదే క్రయోథెరపీ


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.