సుదీర్ఘ ప్రయాణాలు సౌకర్యవంతంగా చేయాలంటే ఒకే ఒక్క మార్గం.. ట్రైన్ జర్నీ. వందల కిలో మీటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, దేశంలోని కొన్ని రైళ్లు తమకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సిమ్లాలో నడుస్తున్న టాయ్ ట్రైన్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంటుంది. తమిళనాడులోనూ ఇలాంటి రైలే పర్యాటకుల హృదయాలను గెల్చుకుంటుంది. ఇంతకీ ఆ రైలు ప్రత్యేక ఏంటి? ఎందుకు ప్రయాణీకులు ఇష్టపడుతున్నారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


గంటకు 10 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం


ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైలు తమిళనాడులోని మెట్టుపాళయం - ఊటీ మధ్య నడిచే నీలగిరి ప్యాసింజర్ గురించి. ఇది దేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు గంటకు కేవలం 10 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది దేశంలోని అత్యంత వేగవంతమైన రైలు కంటే దాదాపు 16 రెట్లు తక్కువ వేగంతో జర్నీ చేస్తుంది. సుమారు 46 కిలో మీటర్ల దూరాన్ని చేరుకోవడానికి అక్షరాలా 5 గంటల సమయాన్ని తీసుకుంటుంది.  దీనికి కారణం కొండ ప్రాంతంలో నడవాల్సి రావడం. చూట్టూ కొండల కోనల నడుమ నడిచే ఈ రైలు ప్రయాణం ప్యాసింజన్లకు అత్యంత ఆహ్లాదకర ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది.


యునెస్కో గుర్తింపు


డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పొడిగింపుగా ఉన్న ఈ రైలును యునైటెడ్ నేషన్స్ బాడీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. UNESCO వెబ్‌సైట్ ప్రకారం, నీలగిరి మౌంటైన్ రైల్వే నిర్మాణం మొదట 1854లో ప్రతిపాదించబడింది. అయితే పర్వత ప్రాంతం నిర్మాణం అత్యంత కష్టం కావడంతో 1891లో పని మొదలు పెట్టారు. 1908లో రైల్వే లైను నిర్మాణం పూర్తయింది. 326 మీటర్ల నుంచి 2,203 మీటర్ల ఎత్తులో కొనసాగే ఈ రైల్వే స్కేలింగ్ ఆనాటి అత్యాధునిక సాంకేతికతకు నిదర్శంగా యునెస్కో పేర్కొంది.


అత్యంత ఆహ్లాదకర ప్రయాణం


IRCTC ప్రకారం..  46-కిమీ ప్రయాణంలో నీలగిరి ప్యాసెంజర్ రైలు అనేక సొరంగాలను దాటుకుంటూ వెళ్తుంది. సుమారు 100 వంతెనల మీదుగా వెళ్తుంది. లోయలు, తేయాకు తోటలు, దట్టమైన అడవులతో కూడిన కొండల మధ్యగా వెళ్తూ ఆహ్లాదరక  ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది. మెట్టుపాళయం నుంచి కూనూర్ వరకు సాగే మార్గంలో అత్యంత అద్భుతమైన దృశ్యాలు దర్శనం ఇస్తుంటాయి.


ప్రధాన స్టేషన్లు, సీటింగ్ వివరాలు


నీలగిరి మౌంటైన్ రైల్వే మెట్టుపాళయం నుంచి ఊటీ మధ్య రోజు వారీ సర్వీసును నడుపుతుంది. రైలు మెట్టుపాళయం నుంచి ఉదయం 7.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఊటీ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాళయం చేరుకుంటుంది. ఈ మార్గంలోని ప్రధాన స్టేషన్లు అయిన కూనూర్, వెల్లింగ్టన్, అరవంకాడు, కెట్టి, లవ్‌డేల్ దగ్గర  రైలు ఆపుతుంది. ఇక ఈ రైలు మొదటి తరగతి, రెండవ తరగతి సీటింగ్ ను కలిగి ఉంది. మొదటి తరగతిలోని సీట్లు కుషన్‌లను కలిగి ఉంటాయి. రెండవ తరగతితో పోలిస్తే వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రయాణీకుల నుంచి  పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2016లో రైలుకు నాల్గవ క్యారేజ్ జోడిస్తారు. 


టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?


నీలగిరి మౌంటైన్ రైల్వేలో ప్రయాణానికి రిజర్వేషన్ IRCTC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. సెలవులు,  వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ముందస్తు బుకింగ్ చేసుకుని ప్రయాణించడం మంచిది.







Also read: ఆస్తమా ఉన్న పిల్లలను దీపావళి కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవాలి?