ఆరోగ్యకరమైన అల్పాహారాలు తినమని వైద్యులు చెబుతుంటారు. ఎప్పుడు సాధారణ ఇడ్లీ తిని బోరుకొట్టిందా అయిదే ఇదిగో ఈ రాగి ఇడ్లీ ప్రయత్నించండి. చాలా టేస్టు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి రాగులతో చేసిన వంటకాలు ఆరోగ్యం. అలాగని రోజూ రాగి జావ, రాగి ముద్ద తినడం బోరు కొడుతుంది. అలాంటి వారికి రాగి ఇడ్లీ ఉత్తమ ఎంపిక. కేవలం మధుమేహం ఉన్నవారికే కాదు, పిల్లలు, మహిళలు కూడా రాగి ఇడ్లీ తినడం వల్ల నీరసం దరిచేరదు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 


కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - రెండు కప్పులు
రాగి పిండి - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ ఇలా
1. ముందుగా సాధారణ ఇడ్లీల కోసం ఎలాగైతే రుబ్బు రెడీ చేసుకుంటారో అలా రెండు కప్పుల రుబ్బు సిద్ధం చేసుకోవాలి. 
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అరకప్పు నీళ్లు పోయాలి. 
3. నీళ్లు వేడెక్కాక రాగిపిండిని వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేయాలి. 
4. రాగి పిండి చిక్కగా ఉడికాక, అందులో ముందుగా కలుపుకున్న ఇడ్లీ పిండిని కూడా వేసి బాగా కలపాలి. 
5. పిండి కాస్త చిక్కగా అయ్యేవరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి. స్టవ్ కట్టేసి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. 
6. పిండి గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయాలి. 
7. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు కాస్త నూనె రాసి ఈ పిండిని వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేయాలి. 
8. పదినిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. 
9. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే టేస్టు అదిరిపోతుంది. 


రాగులతో చాలా లాభాలు
1. రాగులలో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. 
2. ఇది సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి ఎవరు తిన్నా మంచిదే. చిన్న పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. 
3. రాగుల్లో అమినోయాసిడ్స్ ఉంటాయి.ఇందులో ట్రిఫ్టోఫోన్ అనే అమినో యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. అందుకు రాగులను తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. 
4. దీనిలో ఇనుము అధికంగా ఉంటుంది. అందుకే ఇది తింటే రక్తహీనత సమస్య రాదు. 
5. మధుమేహం ఉన్నవారికి రాగులు చాలా మేలు చేస్తాయి. రాగితో చేసిన వంటకాలు వెంటనే రక్తంలో గ్లూకోజును వెంటనే విడుదల చేయదు. అందుకే డయాబెటిస్ ఉన్న వారికి ఇది మంచిది.  అందుకే రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని చెబుతారు వైద్యులు. 


Also read: కుండ కొనండి, ఇంట్లోనే ఇలా కుండ బిర్యానీ చేయండి, ఇదిగో సింపుల్ రెసిపీ


Also read: తెలంగాణాలో జికా వైరస్, తేల్చిన ఆరోగ్య సంస్థ, ఇదెలా సోకుతుంది? లక్షణాలేంటి?