Pig Virus Disease : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ASFV)​ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా పూణేలో ఈ వైరస్​కు సంబంధించి రెండు కేసులు కనుగొన్నారు. ASFV అనేది పందులలో వంద శాతం మరణాల రేటుతో అత్యంత ప్రాణాంతక వైరల్ ఇన్​ఫెక్షన్​గా చెప్పవచ్చు. దీనికి చికిత్స లేనందును ఆ రాష్ట్ర అధికారులు వైరస్ సోకిన పందులను వీలైనంత వేగంగా సురక్షితమైన పందులకు దూరంగా మార్చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎలాంటి వైరస్? దీని లక్షణాలు ఏమిటి? మనుషులకు కూడా ఇది వ్యాపిస్తుందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మళ్లీ విజృంభిస్తున్న వైరస్


ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ 2020లో ఉద్భవించింది. దీనిని మొదట్లో నియంత్రించినప్పటికీ.. పూణేలో వైరస్​ మళ్లీ కనిపించింది.  దీనిని కంట్రోల్ చేయడానికి అడవి, పెంపుడు పందులకు అదుబాటులో ఉన్న ఏకైక రోగనిరోధక చర్య టీకా అని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ వైరల్ వ్యాధి తీవ్రమైన రూపంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మరణాలకు దారితీస్తుంది. అయితే జంతువుల నుంచి మనుషులకు వచ్చే కొన్ని వైరస్​ల మాదిరిగా ఇది కూడా వస్తుందా అనే ప్రశ్నకు నో అని చెప్తున్నారు వైద్యులు. ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేయదని, ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపదని చెప్తున్నారు. 


వ్యాప్తి ఎలా ఉంటుందంటే..


వైరస్ సోకిన పందులు, మలం లేదా శరీర ద్రవాలతో ప్రత్యక్షసంబంధం కలిగి ఉన్నప్పుడు పందులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి ప్రత్యక్ష సాధనాలు అయితే.. వాహనాలు లేదా పందులతో పనిచేసే వ్యక్తులు వైరస్ వ్యాప్తికి పరోక్ష కారకాలు అవుతున్నాయి. ఇది మనుషులకు వ్యాపించని రోగమే అయినా.. దాని అంటువ్యాధి, ప్రాణాంతక స్వభావం కారణంగా వైరస్ సోకిన పందులకు దూరంగా ఉండడమే మంచిది అంటున్నారు. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్​లు ఉన్నట్లే.. వ్యాపించని వైరస్​లు కూడా ఉన్నాయి. అయితే వైరస్ సోకిన పందులకు కిలోమీటర్ దూరంలో ఉంటే మంచిది అంటున్నారు. ఇలా చేయడం వల్ల పందుల్లో వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ఈ ప్రక్రియ హెల్ప్ అవుతుంది అంటున్నారు. 


వైరస్ వ్యాప్తికి ప్రత్యక్ష, పరోక్ష కారణాలు ఇవే


వైరస్ వ్యాప్తి వెనుక ఎలాంటి కారణాలు ఇంక తెలియరాలేదు. వైరస్ సోకిన పందుల నుంచి నమూనాలు సేకరించడానికి, వాటి యజమానుల నుంచి ప్రయాణ చరిత్ర సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, వెటర్నరీ వైద్యులు వైరస్​కు సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. 


వైరస్ లక్షణాలు ఇవే..


అధిక స్థాయిలో జ్వరం, రక్తంతో కూడిన విరేచనాలు, చర్మం నల్లబడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, బలహీనత వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన పందులలో ఉంటాయి. పందులు యజమానులు, వెటర్నరీ వైద్యులు పందులలో ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వాటిని వైరస్ సోకని పందులకు దూరంగా ఉంచాలి అంటున్నారు. వెంటనే అధికారులకు ఈ విషయం తెలపాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు తక్షణమే పందులకు టీకాలు వేయించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.


Also Read : ఆ నటి చనిపోయింది ఈ వ్యాధితోనే.. ఆ సమస్యతో బతికే అవకాశాలు చాలా తక్కువట