కష్టం, నమ్మకం... వీటినే ఒక యజమాని తన ఉద్యోగి నుంచి ఆశించేవి. సంస్థ కోసం కష్టపడడమే కాదు, సంస్థకు సంబంధించిన అంశాలు బయటికి చెప్పకుండా నమ్మకంగా పనిచేసే వ్యక్తిని ఏ సంస్థ అధినేత మాత్రం వదలుకుంటారు. అందుకే కేరళకు చెందిన ఒక సంస్థ యజమాని తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ ఉద్యోగి తన సంస్థకు గట్టి పునాది లాంటి వాడని అన్నారు. ఆ బెంజ్ కారు ఖరీదు అక్షరాలా రూ.45 లక్షలు. 


కేరళకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయెన్సెస్ రిటైలర్ సంస్థ మైజి. దీని యజమాని ఏకే షాజి. ఇతని దగ్గర అనీష్ అనే వ్యక్తి 22 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మైజి సంస్థను స్థాపించకముందు నుంచి అతను షాజి దగ్గరే పనిచేస్తున్నాడు. సంస్థను స్థాపించాక తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. మార్కెటింగ్, మెయింటేనెన్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఇలా కంపెనీలలో చాలా హోదాలలో పనిచేశాడు. సంస్థకు తన అవసరం ఎక్కడ ఉందో అక్కడ పనిచేయడానికి వెనుకాడలేదు. ఇప్పుడు మైజీ చాలా గొప్పగా స్థిరపడింది. అందులో అనీష్ పాత్ర మరువలేనిదని అంటారు ఆ సంస్థ యజమని షాజీ. ప్రస్తుతం అనీష్ మైజీ కంపెనీలో చీఫ్ బిజినెస్ డెవెలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కష్టాన్ని, నమ్మకమైన వ్యక్తిత్వాన్ని గుర్తించిన షాజీ అతనికి ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలనుకున్నారు. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును ఇచ్చారు. ఆ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. 


‘నేను మైజీని ప్రారంభించకముందు  నుంచి అనీష్ నా దగ్గర పనిచేస్తున్నాడు. అతని అంకితభావం, సోదరుడిలా చూపించే ఆప్యాయతా నాకు నచ్చాయి. నేను అనీష్ ను ఉద్యోగిగా కాకుండా వ్యాపార భాగస్వామిగా చూస్తున్నాను’ అని ఇన్ స్టాలో పేర్కొన్నారు. అనీష్ ఫ్యామిలీకి కారును గిఫ్టుగా ఇచ్చిన ఫోటోలను కూడా పంచుకున్నారు. 





Also read: మొటిమలను తగ్గించే ప్రభావవంతమైన చిట్కాలు ఇవిగో


Also read: ప్లేటు బిర్యాని ఇరవై వేల రూపాయలు, ఎక్కడో తెలుసా?