ఇడ్లీ తరువాత ఎక్కువ మంది తినే బ్రేక్ ఫాస్ట్ దోశె.  దోశె ప్రేమికుల సంఖ్య తక్కువేమీ కాదు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ దోశె ఇప్పుడు ఉత్తర భారత దేశంలోని ప్రజలను కూడా అలరిస్తోంది. దేశాలు దాటి విదేశాల్లో కూడా దోశె షాపులు వెలిశాయి. క్రిస్పీగా, రేకులా ఉండే దోశెలను ఎక్కువ మంది ఇష్టపడతారు. మసాలా దోశె, ఆనియన్ దోశె,  చీజ్ దోశె,  బటర్ దోశె,  కారం దోశె... ఇలా ఎన్నో రకాల దోశెలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో దోశెలు చేసుకునేటప్పుడు... బయట దొరికినంత క్రిస్పీగా, పలుచగా రావు. దానికి కారణాలు ఏమిటో వివరిస్తున్నారు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్. తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో దోశె సరిగా రాకపోవడానికి కారణాలను వివరించారు. ఈ తప్పులు సరిదిద్దుకుంటే క్రిస్పీ, టేస్టీ దోశలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.


1. ఇప్పుడు ఇళ్లల్లో అధికంగా వాడేది నాన్ స్టిక్ పాన్స్.  పూర్వం ఇనుముతో చేసిన పెనాలను వాడేవారు. అందుకే ఆ పెనంపై నూనె రాసి లేదా ఉల్లిపాయలతో రుద్ది, ఆ తర్వాత దోశె వేసేవారు. కానీ ఇప్పుడు నాన్‌స్టిక్ తవాలనే ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి నూనె వేయాల్సిన అవసరం కానీ ఉల్లిపాయతో రుద్దాల్సిన అవసరం కానీ లేదు. మరీ నూనెగా ఉన్నా కూడా దోశె టేస్టీగా రాకపోవచ్చు. 


2. చాలామంది స్టవ్ పై పెట్టిన పెనం... వేడవ్వక ముందే దోశె వేయడం లేదా అతిగా వేడెక్కాక దోశె వేయడం చేస్తుంటారు.  ఈ రెండూ దోశె రుచిని, ఆకారాన్ని చెడగొడతాయి. కాబట్టి మంటను ఎప్పుడూ మద్యస్థంగా ఉంచి పెనం కాస్త వేడెక్కాక అప్పుడు పిండిని వేయాలి. 


3. ఇనుముతో చేసిన పెనంపై దోశెలు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ పై వేసినట్టు ఒక చుక్క ఆయిల్ వేసి దోశె వేస్తామంటే రాదు. ఉల్లిపాయలతో రుద్దాలి, ఒక స్పూను ఆయిల్ వేసి అది వేడెక్కాక దోశె వేయాలి. 


4. దోశె పిండిని ఎలా కలిపారు అన్నది కూడా టేస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. మరీ మందంగా కలిపినా దోశె రాదు, అలా అని నీళ్ళలాగా కారుతున్నట్టు ఉన్నా కూడా రాదు. చెఫ్ సంజీవ్ చెబుతున్న ప్రకారం దోశె పిండి మరీ మందంగా కాకుండా, అలా అని మరీ కారుతున్నట్టు కాకుండా మీడియం స్థాయిలో ఉండాలి. 


5. చాలామంది చేసే పని... దోశె పిండిని అప్పుడే రుబ్బి, వెంటనే దోశెలు వేయడం. ఇలా వేయడం వల్ల సరైన రుచిని, ఆకృతిని పొందలేరు. ముందు రోజు రాత్రి దోశె పిండిని కలిపి రాత్రంతా పులియబెడితే ఉదయానికి టేస్టీ దోశెలు వేసుకోవచ్చు.


6. దోశె పిండిని రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు. అలాగే వేడి తగిలే ప్రదేశాల్లో కూడా ఉంచకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అది చక్కగా పులుస్తుంది. పులిసిన తర్వాత ఫ్రిజ్లో పెట్టుకున్నా ఫర్వాలేదు. 


పైన చెప్పిన జాగ్రత్తలతో ఈసారి దోశె ప్రయత్నించండి, కచ్చితంగా టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది. 


Also read: ఆకుపచ్చ, తెలుపు, ఊదా రంగుల్లో ఉండే తేనెల గురించి తెలుసా?