మధుమేహం వచ్చిందంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచే ఆహారాలను తినకూడదు. అల్పాహారంలో ఏం తినాలి? లంచ్ లో ఏం తినాలి? రాత్రి ఆహారం ఏం తింటే ఆరోగ్యం బావుంటుంది ఇలా వారి ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. కారణం మధుమేహం చాలా ప్రమాదకరమైనది. ఏమాత్రం అలక్ష్యం వహించినా ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే శరీరంలోని ఇతర ప్రధాన అవయవాలపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో తినే ఆహారం రోజంతా ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ రోగులు ఏం తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయో అలాంటి బ్రేక్ ఫాస్ట్ లు ఇవన్నీ. 


ఓట్స్ ఉప్మా
ఓట్స్ తో చేసే ఏ వంటకాలైనా షుగర్ పేషెంట్లకు మంచివే. అల్పాహారంగా ఓట్స్ ఉప్మాను తినడం వల్ల రోజంగా ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. ఓట్స్ ఉప్మాలో రకరకాల వెజిటబుల్స్ వేసుకుని టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే నీళ్లలో ఉడికించిన ఓట్స్, పాలు, నట్స్ కలుపుకుని తిన్నా చాలా మంచిది. ఓట్స్‌ను రోజూ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 


గోధుమ రవ్వ ఉప్మా
ఓట్స్ లాగే గోధుమ రవ్వ ఉప్మా కూడా మధుమేహులకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫాస్పరస్, జింక్, మెగ్నిషియం వంటివి చాలా మేలు చేస్తాయి. నరాల వ్యవస్థకు ఇవి అత్యవసరం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక మధుమేహులకు మేలు చేస్తుంది. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో బీన్స్, క్యారెట్ వంటివి కలుపుకుని వండుకుంటే ఇంకా ఆరోగ్యం. 


పెసరట్టు
మధుమేహ రోగులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా అవసరం. పెసరపప్పులో ఫైబర్ కంటెంట్ అధికం. కాబట్టి రోజూ పెసరట్టు తిన్నా మంచిదే. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలం. పెసరట్టు తినడం రోజంతా శక్తిమంతంగా అనిపిస్తుంది. 


రాగి దోశ
రాగి జావ రోజూ తాగితే అధిక బరువు  తగ్గుతుంది. డయాబెటిస్ రోగులకు ఉత్తమ అల్పాహారం రాగితో చేసిన వంటకాలు. రాగి దోశ, రాగి జావ వారికి చాలా మేలు చేస్తాయి. ఇది ఎముకలను బలంగా మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. రోజూ రాగితో చేసిన వంటకాలు తినేవారిలో నీరసం కూడా తగ్గుతుంది. 


ఉదయం కప్పు పెరుగు తిన్ని కూడా చాలా మంచిది. 


ఇడ్లీ, దోశె, బోండా వంటివి తినడం వల్ల ఆరోగ్యసమస్యలు ఎదురవ్వచ్చు. ఇడ్లీలో కూడా బియ్యం రవ్వ కలుపుతాం, దోశెలకు నానబెట్టిన బియ్యాన్ని చేరుస్తాం. దీనివల్ల కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరుతాయి. ఇక బోండాల్లో కొంతమంది మైదా కలిపే అవకాశం ఉంది. కాబట్టి అవి పూర్తిగా తినకపోతేనే మంచిది. 


Also read: మైదా అవసరం లేకుండా ఇంట్లోనే అరటి పండుతో కప్‌‌కేక్స్, చేయడం చాలా సులువు


Also read: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ‘స్పితి వ్యాలీ’, మనదేశంలోనే ఉంది