వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం తొలిగా పడేది మెదడుపైనే. మెదడు పనితీరు మందగించడం, విషయాలు మర్చిపోతూ ఉండడం జరుగుతుంది. అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశం కూడా పెరుగుతుంది. మెదడును కాపాడుకోవాలంటే కొన్ని రకాల ఆహారాన్ని ముందు నుంచే తినడం ప్రారంభించాలి. వీటిని యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని పిలుస్తారు. వీటిని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాదు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుంది. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. మెదడు కూడా చురుగ్గా వ్యవహరిస్తుంది. అయితే అవి ఆ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.


బ్లూ బెర్రీస్, కొవ్వు పట్టిన చేపలు, ఆకుపచ్చని ఆకుకూరలు, పసుపు, నట్స్... ఇవి ప్రతిరోజూ ఈ ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. ఇవన్నీ కూడా మెదడుకు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ మెదడు కణాలను దెబ్బతీయడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగంగా జరుగుతుంది. వీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రోజుకు ఆరేడు బ్లూబెర్రీస్ తింటే చాలు.


కొవ్వు పట్టిన చేపలు వారానికి కనీసం రెండుసార్లు తినాలి. చేపల్లోని కొవ్వుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడుకు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు వీటిని ప్రత్యేకంగా తినమని వైద్యులు కూడా సూచిస్తారు. కొత్త మెదడు కణాల ఉత్పత్తికి ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. అలాగే మెదడు చురుగ్గా, ఉత్సాహంగా ఉండేందుకు కూడా ఇవి అవసరం. కాబట్టి కొవ్వు పట్టిన చేపలను వండుకొని తినడం ముఖ్యం. సాల్మన్, మాకెరెల్ వంటి చేపల్లో కొవ్వు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆకుకూరల్లో పాలకూర, కాలే, తోటకూర, బచ్చలి కూర, పుదీనా, కొత్తిమీర వంటివి అధికంగా తింటూ ఉండాలి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మెదడుకు అవసరమైనవి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మతిమరుపు రాకుండా అడ్డుకుంటాయి.


మన ప్రతి వంటకంలో ఖచ్చితంగా పసుపు వేస్తాము. ఇది సూపర్ ఫుడ్ అని చెప్పాలి. పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడుకు అత్యవసరమైనది. మెదడును వృద్ధాప్యం బారిన త్వరగా పడకుండా కాపాడుతుంది. మెదడు సంబంధ వ్యాధులు రాకుండా కూడా అడ్డుకుంటుంది. కాబట్టి మీరు ఉండే ప్రతి కూరలో పసుపు కచ్చితంగా వేసుకోండి. ఇక నట్స్ విషయానికి వస్తే బాదం, అవిసె గింజలు, వాల్నట్స్, జీడిపప్పులు వంటి వాటిలో ఒమెగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. మెదడు పనితీరుకు ఈ నట్స్ చాలా అవసరం. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజూ గుప్పెడు నట్స్ తినడం అలవాటు చేసుకోండి.




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.