‘పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకు తన తల్లి పాలే పడకపోవడం ఏంటి? వింత కాకపోతేను’... ఇలా వాదించే వాళ్లు ఎంతో మంది. కానీ ఇది నిజం. పుట్టుకతోనే బిడ్డకు ఈ సమస్య వస్తుంది. ఇంకా చెప్పాలంటే గర్భంలో ఉండగానే వారికి ఇది మొదలవుతుంది. బిడ్డ పుట్టిన కొన్నిరోజులకే బయటపడుతుంది. ఇలా తల్లిపాలనే బిడ్డ పాలిట శాపంగా మార్చిన ఆ సమస్య పేరు ‘లాక్టోజ్ ఇంటాలరెన్స్’. ఇదొక అలెర్జీలాంటిది. ఈ సమస్య గురించి విన్న వాళ్లు తక్కువమందే ఉంటారు. కనీసం తమ బిడ్డకు ఈ అలెర్జీ ఉందని గుర్తించలేని తల్లులు ఎంతో మంది. వారికోసమే ఈ కథనం. లాక్టోజ్ ఇంటాలరెన్స్ వినడానికి కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ పూర్వం నుంచి ఇది శిశువుల పాలిట శాపంగా మారింది.  


అసలేంటిది?
పాలల్లో లాక్టోజెన్ అనే పదార్థం ఉంటుంది. తల్లి పాలే కాదు, మేక, ఆవు... ఇలా ఏ జీవి ఇచ్చే పాలలో అయినా ఇది ఉంటుంది. ఈ పదార్ధం అరగాలంటే మన పేగుల్లో లాక్టోజ్ అనే ఎంజైమ్ అవసరం. ఇది మన పేగుల్లో పుట్టుకతోనే ఉంటుంది. కానీ కొందరిలో మాత్రం పేగుల్లో ఈ లాక్టోజ్ లోపిస్తుంది. ఇలా లాక్టోజ్ లోపంతో పుట్టిన శిశువులకు ‘కంజెనిటల్ లాక్టోజ్ ఇంటాలరెన్స్’ సమస్య మొదలవుతుంది. వీరికి తల్లి పాలు అరగవు. తాగాక చాలా ఇబ్బంది పడుతుంటారు.  ప్రపంచంలో చాలా మంది శిశువుల్లో ఈ సమస్య కనిపిస్తోంది.


లక్షణాలు ఎలా ఉంటాయంటే...
మీ బిడ్డకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే సమస్య ఉందో లేదో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.
1. బిడ్డ పుట్టిన వారం రోజుల తరువాత నుంచి ఈ సమస్య లక్షణాలు  బయటపడడం మొదలవుతుంది. శిశువుల పొట్ట ఉబ్బినట్టుగా అవుతుంది. పొట్టలో పాలు అరగక గ్యాస్ చేరి ఇలా పొట్ట ఉబ్బుతుంది. 
2. విరేచనాలు కావడం, వాంతులు కావడం వంటివి జరుగుతాయి. 
3. పిల్లలు గుక్కపెట్టి ఏడవడం, బరువు సరిగా పెరగకపోవడం వంటివి కలుగుతాయి.


ప్రాణాంతకమా?
విరేచనాలు, వాంతులు కావడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. సకాలంలో గుర్తించి వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లకపోతే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.


చికిత్స చాలా సింపుల్
మీ శిశువుల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. వారు స్టూల్ టెస్టు (విరేచనం పరీక్ష) ద్వారా పిల్లలకు ఆ సమస్య ఉందో లేదో తేలుస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే వారం రోజులు తల్లి పాలు ఆపి, లాక్టోజన్ లేని పాల పొడిని వాడమని సలహా ఇస్తారు. లాక్టోజ్ లేని పాలపొడులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటినే వైద్యులు వాడమని సలహా ఇస్తారు. ఇప్పుడు చాలా సంస్థలు ఈ పాలపొడులను మార్కెట్లోకి దించాయి. సమస్య తీవ్రత తగ్గాక అంటే వారం, పది రోజులు తరువాత మళ్లీ తల్లి పాలు పట్టచ్చు. కానీ కొన్ని రోజుల తరువాత మళ్లీ గ్యాస్, కడుపుబ్బరం, విరచనాలు మొదలవ్వచ్చు. కనుక తల్లి రోజులో ఓ 12 సార్లు బిడ్డకు పాలు పెడితే... ఓసారి తల్లి పాలు, మరోసారి లాక్టోజ్ లేని పాలు ఇలా తాగిస్తే సమస్య మళ్లీ ఎదురవ్వదు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ లాక్టోజ్‌ను అరిగించుకునే శక్తి వస్తుంది. కొందరి పిల్లల్లో ఆరునెలల వయసు దాటగానే, కొందరి పిల్లల్లో ఏడాది వయసు దాటగానే ఈ సమస్య పూర్తిగా పోతుంది. అప్పుడు ఏ పాలు పట్టినా ఫర్వాలేదు.  చాలా తక్కువ మంది పిల్లల్లో మాత్రమే జీవితాంతం ఉండిపోతుంది. 


తల్లి పాలు ఆపడం నేరమా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం తల్లి పాలు బిడ్డకు ప్రాణాంతకంగా మారినప్పుడు నిలిపి వేయడమే ఉత్తమం. ఆ సంస్థ ఇచ్చిన మార్గనిర్ధేశాలలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల శిశువులు పద్నాలుగు రోజుల పాటూ వాంతులు, విరేచనాలతో బాధపడితే, బరువు కోల్పోతుంటే అలాంటి వారికి తల్లి పాలు నిలిపి వేయవచ్చు. వారికి లాక్టోజ్ లేని పాలపొడులతో పాలను తయారు చేసి పెట్టొచ్చు. 


Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది


Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?


Also read: సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ బ్రిటిష్ ఆఫీసర్... అతని ఆత్మ ఇంకా అక్కడే ఉందుంటున్న స్థానికులు


Also read: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా


Also read: చలికాలపు అనారోగ్యాలకు చెక్ పెట్టే వెల్లుల్లి సూప్ ... వారానికోసారి తాగినా చాలు


Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు












ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.