Dengue Dangerous for Diabetic Patients : వర్షాకాలంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు పెరుగుతాయి. అలాగే డెంగ్యూ కేసులు కూడా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇలాంటి సమయాల్లో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు.. సాధారణ ప్రజల కంటే మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. నివేదికల ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి తీవ్రమైన, ప్రాణాంతకమైన డెంగ్యూ వచ్చే ప్రమాదం ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. 

Continues below advertisement

మధుమేహం ఉంటే ఆ ప్రమాదం ఎక్కువే..

డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో ఉండే మధుమేహ రోగులు సాధారణ ఆరోగ్య సంరక్షణతో పాటు డెంగ్యూ టీకాపై కూడా శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్త చక్కెర అనేది శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల డెంగ్యూ వైరస్ శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది. అటువంటి రోగులకు ప్లేట్‌లెట్ కౌంట్ అకస్మాత్తుగా పడిపోవడం.. అంతర్గత రక్తస్రావం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తన్నారు. వయస్సు, ఊబకాయం, మూత్రపిండాల వ్యాధి, అదుపులో లేని బ్లడ్ షుగర్ వంటి పరిస్థితులు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని పరిశోధనలు చెప్తున్నాయి.

Also Read : డెంగ్యూ vs వైరల్ ఫీవర్.. రెండింటి మధ్య తేడాలు ఇవే, తెలుసుకోకుంటే ప్రమాదమే

Continues below advertisement

డెంగ్యూ టీకా వేసుకోకుంటే మరణమేనా?

నివేదికల ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. వీరికి షుగర్ లేనివాళ్లతో పోలిస్తే.. గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో మధుమేహం ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి.. సాధారణ సంరక్షణలో భాగంగా డెంగ్యూ టీకాను పరిగణించాలని సూచిస్తున్నారు. అనేక అంతర్జాతీయ పరిశీలనా అధ్యయనాలు, మెటా-విశ్లేషణలు కూడా మధుమేహం ఉన్నవారికి తీవ్రమైన డెంగ్యూ, మరణం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని సూచిస్తున్నాయి.

మధుమేహం ఉన్నవారికి డెంగ్యూ వస్తే..

మధుమేహం ఉన్నవారిలో డెంగ్యూ ప్రారంభ లక్షణాలు.. సాధారణ జనాభాలో కనిపించే లక్షణాల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. వీటిలో అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే.. నిర్లక్ష్యం వహించవద్దని సూచిస్తున్నారు.

Also Read : పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు.. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

తీవ్రమైన లక్షణాలు..

అలాగే డెంగ్యూ సమయంలో మీకు నిరంతర వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, విపరీతమైన బలహీనత లేదా నీరసం, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, మూత్రవిసర్జన తగ్గడం, తల తిరగడం, లేదా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలు తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మధుమేహ వ్యాధిగ్రస్తులు డెంగ్యూ వంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. దోమల నివారణ మందులు వాడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించడానికి ఇంటి చుట్టూ నీటిని నిలవ ఉంచాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, పుష్కలంగా నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. జ్వరం ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

రోగి పరిస్థితి, ఆకలి, శరీరంలో నీటి శాతంపై ఆధారపడి.. డెంగ్యూ జ్వరానికి కొన్ని మధుమేహ మందులలో తాత్కాలిక సర్దుబాట్లు చేయాల్సి వస్తుంది. తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి రక్తంలో చక్కెర, ప్లేట్‌లెట్ కౌంట్, రోగి సాధారణ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా అవసరం.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.