Cervical Cancer: బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణ వార్త ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది. అసలు ఇది నిజమా కాదా అని ప్రేక్షకులు సందేహంలో పడిపోయారు. ముందుగా పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించినట్టు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తన టీమ్. దీంతో అది నిజమే అనుకున్న నెటిజన్లు.. RIP అంటూ స్టేటస్‌లు పెట్టారు. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందరి సందేహం తీర్చడానికి శ్రీకాంత్ మిర్యాల అనే డాక్టర్.. తన ట్విటర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 


మన దేశంలోనే ఎక్కువ..


‘‘మనదేశంలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ. దీన్నే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. దీన్ని చాలా సులువుగా గుర్తించవచ్చు. తొలి రెండు స్థాయిల్లో చికిత్స సులభం కూడా. కానీ విషయం ఏంటంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నవాళ్ళలో దాదాపు నూరుశాతం మందిలో హెచ్పీవీ ఇన్ఫెక్షన్ గుర్తించారు’’ అని డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల తెలిపారు. HPV అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని, ఇది మామూలుగా చేతులు పాదాల మీద చిన్న కాయలు కాచేలా చేస్తుందని తెలిపారు. ఈ వైరస్‌లో మొత్తం 120 రకాలు ఉండగా అందులో 20 రకాలు క్యాన్సర్‌కు కారణమవుతాయన్నారు.


10, 20 సంవత్సరాల తర్వాతే..


సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్ రక్షణ తీసుకోకుండా శృంగారం వల్ల వ్యాపిస్తుందని డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల క్లారిటీ ఇచ్చారు. మగవారిలో ఈ వైరస్ సోకిన తర్వాత కూడా లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చని చెప్పారు. ఈ వైరస్ సోకినవాళ్లు తెలియకుండా ఇతరులతో శరీరకంగా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుందన్నారు. అలా మగవారి నుండి ఆడవారికి సోకిన వైరస్ కూడా మొదట్లో ఏ లక్షణాలు చూపించదని, దానివల్ల ఎవరూ దానికి చికిత్స కూడా తీసుకోరని అన్నారు. దాంతో ఈవైరస్ గర్భాశయ ముఖద్వారాన్ని చేరి అక్కడి కణాల్లో నిక్షిప్తమై పది, ఇరవై సంవత్సరాల తర్వాత క్యాన్సర్‌కు దారి తీస్తుందని వివరించారు.


ఎక్కువమందితో శారీరకంగా కలవడం వల్లే.. 


యుక్త వయస్సులో ఎక్కువమందితో శారీరకంగా కలిసే ఆడవారికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని డాక్టర్ తెలిపారు. ‘‘ఈ ఇన్ఫెక్షన్‌కు కేవలం శరీరక కలయిక మాత్రమే కారణమవుతుంది. అందుకే దీని వల్ల క్యాన్సర్ రాకుండా యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలకి వాక్సిన్ ఉచితంగా ఇస్తోంది భారత ప్రభుత్వం. కానీ వ్యాక్సిన్ తీసుకోక ముందే ఇన్ఫెక్షన్ సోకితే.. ఈ వ్యాక్సిన్ పనిచేయదు. ప్రతి సంవత్సరం ప్యాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేసుకుని, తొలిదశలోనే కనిపెట్టి వైద్యం చేయించుకోవచ్చు’’ అని సలహా ఇచ్చారు. ఎక్కువమందితో శారీరకంగా కలవడం వల్లే ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయని, కానీ దాని గురించి పేషెంట్లకు సలహాలు ఇచ్చే బాధ్యత డాక్టర్లది కాదు అని శ్రీకాంత్ మిర్యాల అన్నారు. అయినా పెళ్లయ్యే వరకు అలాంటివి చేయవద్దని, పెళ్లయిన తర్వాత భాగస్వామితో మాత్రమే శరీరకంగా కలవాలని సలహా ఇచ్చారు.


Also Read: తమన్నాతో పెళ్లెప్పుడు? ప్రియుడు విజయ్ వర్మ జవాబుకు నవ్వుకుంటున్న నెటిజన్స్