ఆఫీసులో పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే ముందు తప్పకుండా ఉద్యోగులు తప్పకుండా తమ మొబైల్ ఫోన్ బ్యాటరీ స్క్రీన్ షాట్‌ను బాస్‌కు చూపించాల్సిందే. లేకపోతే, వాళ్లు తర్వాతి రోజు నుంచి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే, ఉద్యోగుల మొబైల్ బ్యాటరీ స్క్రీన్ షాట్స్‌తో బాసుకు పనేంటి అనేగా మీ సందేహం? అయితే, పదండి.. చైనాలోని ఆ సంస్థలో ఎందుకు ఆ రూల్ పెట్టారో తెలుసుకుందాం. 


కోవిడ్-19కు పుట్టినిల్లయిన ఉహాన్ గురించి మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆ నగరంలోని ఓ చిన్న సంస్థలో బాస్ పెట్టిన రూల్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో చర్చనీయంగా మారాయి. ఉద్యోగులు ఆఫీసులో అడుగు పెట్టిన వెంటనే తమ మొబైల్ ఫోన్ బ్యాటరీ స్క్రీన్ షాట్‌ను బాస్‌కు పంపాలి. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లే ముందు కూడా అదే పని చేయాలి. బాస్ పెట్టిన ఈ రూల్‌ను పాటించడం అక్కడి ఉద్యోగులకు అస్సలు నచ్చడం లేదు. గట్టిగా అరిచి తమ నిరసన వ్యక్తం చేయాలనే కోపం వస్తున్నా.. ఉద్యోగం పోతుందనే భయంతో మౌనంగా స్క్రీన్ షాట్ తీసి పంపేస్తున్నారు.


ఆ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి తనకు తెలిసిన జర్నలిస్టుకు ఈ విషయాన్ని చెప్పాడు. అంతే, తర్వాతి రోజు ఈ వార్త కరోనా కంటే వేగంగా వ్యాపించింది. ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే జరిగింది. అంతా ఆ బాసును తిట్టిపోస్తున్నారు. ఉద్యోగుల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే, తాను ఆ పని చేయడానికి న్యాయమైన కారణమే ఉందని ఆ బాస్ అందరికీ వివరణ ఇస్తున్నాడు.  


ఇటీవల తమ సంస్థలో ఉత్పాదన బాగా తగ్గిపోయింది. ఉద్యోగుల పనితీరు మందగించింది. ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేయడమే ఇందుకు కారణమని ఆ బాస్‌కు సందేహం కలిగింది. ఫోన్లలో వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేయడం వల్ల సంస్థ నష్టాల్లోకి జారుకున్నట్లు భావించి.. అందరికీ రూల్ పెట్టాడు. జాబ్ పూర్తయిన తర్వాత ఫోన్ సెట్టింగులలో వెళ్లి ఆ రోజు బ్యాటరీ వినియోగానికి సంబంధించిన గ్రాఫ్ స్క్రీన్‌షాట్‌లను తీసి తనకు పంపాలనే ఆదేశించాడు. ఇలా చేయడం ఇష్టం లేకపోయినా ఉద్యోగులు ఈ రూల్ పాటిస్తున్నారు. 


Also Read: లక్కున్నోడు - 34 ఏళ్లుగా భార్య వద్దన్నా వినలేదు, ఇప్పుడు రూ.2.5 కోట్లతో ఆమెకు షాకిచ్చాడు!
 
దీంతో నెటిజనులు ఆ ఉద్యోగులకు కొన్ని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ‘‘మీతోపాటు మరో స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లండి. వెళ్లేప్పుడు ఆ ఫోన్ బ్యాటరీ స్క్రీన్ షాట్‌ను మీ బాస్‌కు పంపించండి. అంతే సింపుల్’’ అని అంటున్నారు. అయితే, చైనా సంస్థలు ఇలాంటి వివాదాస్పద రూల్స్ పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ సంస్థ తమ ఉద్యోగులు టాయిలెట్లలో కూర్చొని మొబైల్ ఫోన్లు చూస్తున్నారనే కారణంతో టాయిలెట్లకు టైమర్‌లను అమర్చింది. మరో సంస్థ ఉద్యోగులు ఎక్కువ సేపు కూర్చోడానికి వీలు లేకుండా.. ఏకంగా టాయిలెట్ కమోడ్ డిజైన్ సైతం మార్పించింది. మరి, మీ సంస్థల్లో కూడా ఇలాంటి వింత రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మా సోషల్ మీడియా వేదికలపై కామెంట్స్ ద్వారా తెలియజేయండి. 


Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?