Stem Cell Therapy Success Rate : ఓ ప్రమాదంలో మెడ నుంచి నడుము కింది భాగం వరకు పక్షవాతానికి గురైన వ్యక్తి ఇప్పుడు తనంతట తానే నిలబడగలుగుతున్నాడని మాయో క్లినిక్ తెలిపింది. ఇంతకీ ఇది ఎలా జరిగింది.. అసలు పక్షవాతం వచ్చిన వ్యక్తి లేచి మళ్లీ నార్మల్​గా నడవగలరా? దీనిపై నిపుణులు ఏమి చెప్తున్నారు? ఈ క్లినికల్ ట్రయల్ ఎప్పుడు జరిగింది? ఎలాంటి చికిత్స చేశారు.. చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


పక్షవాతం వచ్చినా.. వేగంగా నడవగలుగుతున్నారు..


ఈ అంశాన్ని హైలైట్​ చేస్తూ.. మాయో క్లినిక్ ఓ ఆర్టికల్​ను ప్రచురించింది. దానిలో ఏడు సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో ఓ వ్యక్తికి మెడ నుంచి కిందికి పక్షవాతానికి గురైనట్లు తెలిపింది. ఇప్పుడు ఆ వ్యక్తి తనంతట తాను లేచి నిలబడగలుగుతున్నాడని.. నడుస్తున్నాడని తెలిపింది. మాయో క్లినిక్​ చేసిన అధ్యయనం ప్రకారం.. క్రిస్ బార్ అనే వ్యక్తికి పక్షవాతానికి గురైనట్లు.. అతని కొవ్వు నుంచి మూలకణాలను సేకరించి.. వాటిని ప్రయోగశాలలో 100 మిలియన్ కణాలకు విస్తరించారట. ఆపై వాటిని క్రిస్ బార్ వెన్నెముకలోకి ఇంజెక్ట్ చేశారు. చికిత్స చేయించుకున్న ఐదేళ్ల తర్వాత అతను స్వయంగా లేవడం, వేగంగా నడవడం వంటివి చేస్తున్నారని తెలిపారు. 


ముగ్గురిలో మాత్రం ఎలాంటి స్పందన లేదు..


ఈ ట్రయిల్​లో బార్​తో సహా మరో 10 మందిపై కూడా క్లినకల్ ట్రయల్స్​ నిర్వహించారు. ఈ​ స్టెమ్​ సెల్​ చికిత్సను విజయంపై కొత్త డేటాను మాయో క్లినిక్ ప్రచురించింది. పదిమందిలో ఏడుగురు చికిత్సలో మెరుగుదలను కనబరిచినట్లు తెలిపారు.  కానీ ముగ్గురు రోగుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదని.. అలా అని.. పరిస్థితి అధ్వానంగా మారలేదని తెలిపారు. దీనికి గల కారణాలపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ పరిశోధనలు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తున్నాయని తెలిపారు. దీనిపై ఇంకా మెరుగైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


చికిత్సను ఇంకా ఆమోదించలేదట..


ఈ ట్రయల్​లో వినియోగించిన మూలకణాలు సురక్షితమైనవని.. ఇవి వెన్నుముక చికిత్సలో ప్రయోజనకరంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఇది న్యూరోసర్జరీ, న్యూరోసైన్స్, వెన్నుపాము గాయంతో ఇబ్బంది పడుతున్న రోగులకు చికిత్స చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయని.. ఈ స్టెమ్ సెల్ థెరపీ ఓ బ్రేక్ త్రూ అవ్వనుందని వెల్లడించారు. దానికి బార్​నే ఉదాహరణగా చెప్తున్నారు. కానీ మరో ముగ్గురిపై ఆశించిన ఫలితాలు రాని నేపథ్యంలో ఈ చికిత్సను ఇంకా ఆమోదించలేదు. 


స్టెమ్ సెల్స్​ థెరపీపై మరిన్ని పరిశోధనలు..


బైడాన్, ఇతర పరిశోధకుల బృందం.. రోగులకు పురోగతిని కలిగించడానికి ఉపయోగపడిన స్టెమ్ సెల్స్ ఎలా ప్రయోజనాలు అందించాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాటివల్ల ఏమైనా ప్రమాదాలు, ఇతర ప్రయోజనాలు ఉన్నాయోనని గుర్తించేందుకు అదనపు పరిశోధనలు చేస్తున్నారు. ఇది చికిత్స ప్రయోజనాలు పెంచడంలో హెల్ప్ చేస్తాయని తెలిపారు. ఇప్పుడైతే మొదటి ట్రయల్ మెరుగైన ఫలితాలు ఇచ్చింది కాబట్టి.. ప్రతి అంశాన్ని పరిశీలించి.. ఈ చికిత్సను డెవలెప్​ చేయాలని పరిశోధకులు చూస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read : టీనేజ్​లో ప్రెగ్నెంట్ అయితే అకాల మరణం తప్పదంటున్న న్యూ స్టడీ.. పెరుగుతున్న మరణాల రేటు