వర్షాకాలం అంటే చల్లగా హాయిగా ఉంటుందని భావిస్తాం. కానీ దాని వెన్నంటే వ్యాధుల భయం కూడా పొంచి ఉంటోంది. అంతేకాదు మిగతా కాలాలతో పోలిస్తే ఈ వర్షాకాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఈ ముప్పు ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల జలుబు, తలనొప్పి, దగ్గు, గొంతులో మంట, కఫం, వైరల్‌ ఫీవర్‌ వంటి వ్యాధుల బారిన పడుతుంటారు.


అసలే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా  వర్షాలు కురుస్తున్నాయి. పైగా పారిశుద్ధ్య లోపం కూడా కనిపిస్తోంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని వైద్య విపుణులు అంటున్నారు. ముఖ్యంగా జీకా, నిఫా, చందిపురా, కొవిడ్ 19 వంటి నాలుగు ఇన్​ఫెక్షన్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ అవి సోకి ఉంటే వాటిని గుర్తించడం ఎలా? దాని ట్రీట్మెంట్​ ఏంటి? అసలు ఈ ఇన్​ఫెక్షన్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


Zika virus -  ఈ జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వైరస్‌ సోకిన ఎడిస్‌ జీనస్​ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సోకుతుంది. 1954లో మొదటిసారి నైజీరియాలో బయటపడింది. అనంతరం అనేక ఆఫ్రికన్‌, సౌత్ అమెరికాలోని దేశాల్లో  ప్రబలింది. భారత్​లోనూ ఈ వ్యాధి కేసులు బానే నమోదయ్యాయి. 


లక్షణాలేంటి? - ఈ వ్యాధి ఇన్​క్యూబేషన్ పీరియడ్ 3 నుంచి 14 రోజులు. చాలా మందికి ఈ వ్యాధి సోకినట్లు లక్షణాలు వెంటనే కనపడవు.  జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు వంటి లాంటి లక్షణాలు  2 నుంచి 7 రోజుల్లో బయటపడతాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. దీంతో పుట్టబోయే పిల్లలకూ ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లేదంటే కడుపులోనే శిశువులు మరణిస్తారు.


నివారణ చర్యలేంటి? - దోమలు కుట్టకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు కుట్టకుండా శరీరాన్ని కవర్ చేసేలా లైట్ కలర్​ డ్రెస్​లు  ధరించాలి. కిటికీలు, డోర్లకు దోమ తెరలు ఉండాలి. చిన్న పిల్లలు, గర్భిణీలకు కూడా దోమ తెరను వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇమ్యూనిటీ సిస్టమ్​ తక్కువగా ఉంటే గుంపులుగా ఉండే ప్రదేశాల్లో ఉండకూడదు. తాగే నీరు, తినే తిండిపై కూడా దోమలు, ఇతర కీటకాలు వాలకుండా చూసుకోవాలి.


చికిత్స ఏమిటి? - ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏమీ లేదు. ఈ వైరస్ సోకితే విశ్రాంతి ఎక్కువ అవసరం. నీరు ఎక్కువగా తాగాలి. జ్వరం సహా ఇతర లక్షణాలు తగ్గడానికి అవసరమైన ట్యాబ్లెట్లను వైద్యులు ఇస్తారు. 


Nipah virus - నిపా వైరస్ ప్రస్తుతం పంజా విసురుతోంది. ముఖ్యంగా కేరళలో ఇది తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడ ఈ వైరస్ బారిన పడి 14 ఏళ్ల బాలుడు మృతిచెందగా, 60 మందిని హైరిస్క్‌ కేటగిరీగా గుర్తించి ఐసోలేట్‌ చేశారు.


1999లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. ఎక్కువగా ఇది గబ్బిలాల నుంచి సోకుతుంది. అలాగే పందులు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు వంటి జంతువుల ద్వారానూ సోకచ్చు. ఈ వైరస్ సోకిన జంతువులతో మనిషి కాంటాక్ట్ అయితే సంక్రమిస్తుంది. ఇది చాలా డేంజర్.


లక్షణాలు? -  ఈ వైరస్ సోకినప్పుడు ముందు  జ్వరం ఆ తర్వాత తలనొప్పి, వాంతులు, దగ్గు, శ్వాసకోస సంబంధిత సమస్యలు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 5 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఆపై మెదడు దెబ్బతిని, శ్వాస సమస్యలు ఎదురై.. రోగి 24 నుంచి 48 గంటల్లోనే కోమాలోకి వెళ్లిపోతాడు.


చికిత్స/నివారణ - ఈ వైరస్‌కు కచ్ఛితమైన వైద్యం అంటూ ఏమీ లేదు. రోగుల్ని ఐసోలేషన్‌లో ఉంచి తగినంత నీరు అందిస్తూ ఆయా లక్షణాలకు చికిత్స అందిస్తారు. కాబట్టి ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే గబ్బిలాలతో, పందులతో కాంటాక్ట్​ను తగ్గించాలి. ముఖ్యంగా ఈ వైరస్​ సోకిన  ప్రాంతాల్లో ఉండే  పండ్లను తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మాస్కులు ధరించాలి. వైరస్ సోకిన వ్యక్తులకు దూరం ఉండాలి.


Chandipura virus - ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్‌లలో చండీపురా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తూ మరణాలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా  చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  


ఈ చండీపురా కీటకాలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో మొదటగా  కేసులు కనిపించాయి. అందుకే దీనికి చండీపురా అని పేరు వచ్చింది. ఎక్కువగా 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుంది. 


లక్షణాలు? - ఫ్లూతో సమానంగా దీని  లక్షణాలు ఉంటాయి. విపరీతమైన జ్వరం, జ్వరం వేగంగా పెరగడం, వాంతులు, విరేచనాలు , తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం జరుగుతుంది. కోమాకు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. కిడ్నీ కూడా ఫెయిల్ అవొచ్చు. తద్వారా మరణానికి దారీ తీస్తుంది. అందుకే జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.


చికిత్స /నివారణ - దీనికి సరైన చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా లేదు. అందుకే దోమలు, ఈగల, కీటకాలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.  ఆహారం విషయంలో ఎంతో జ్రాగ్రత్తగా ఉండాలి.  పిల్లలకు రాత్రిపూట పూర్తిగా  కప్పేలా దుస్తులు ధరించాలి.  దోమ తెరలు వాడాలి.  దోమల నివారణ మందులు వాడాలి. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.


Corona Virus - మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు మళ్లీ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. రీసెంట్​గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అమెరికా ప్రెసిడెంట్ జో బెడైన్ వంటి ప్రముఖులకు ఇది సోకింది. భారత్​లో రోజూ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. జూన్ 26వ తేదీ నాటికి ప్రతిరోజు దాదాపుగా 215గా ఉండే కేసులు.. ప్రస్తుతం 307కు  పెరిగినట్లు తెలిస్తుంది.


లక్షణాలు? - ఛాతినొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్ర దగ్గు, వాపు, మెడ్ నొప్పి, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 60ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, డయాబెటీస్​, క్యాన్సర్​ ఉన్న వారికి త్వరగా సోకుతుంది. 


చికిత్స /నివారణ -  మాస్క్​లు ధరించాలి. సోషల్ కాంటాక్ట్​కు దూరంగా ఉండాలి. పబ్లిక్​లో తిరగకూడదు. వైద్యుల్ని సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవాలి. హోం క్వారంటైన్​లో ఉండాలి. బలమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.


Also Read : డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్లేట్‌లెట్ కౌంట్​ని పెంచే ఇంటి చిట్కాలివే