తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్ల తేదీలను పోలీసు నియామక మండలి నవంబరు 27న ఒక ప్రకనటలో తెలిపింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 8 నుంచి జనవరి 3 వరకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిజికల్ ఈవెంట్లకు తెలంగాణ పోలీసు నియామక మండలి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేసింది. వాటిలో అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మైదానంలో సగటున 130 మంది సిబ్బంది ఈవెంట్లను పర్యవేక్షించనున్నారు.


29 నుంచి హాల్‌టికెట్లు..


ఈవెంట్స్‌కు సంబంధించి అడ్మిట్ కార్డులను నవంబర్ 29 ఉదయం 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ అడ్మిట్ కార్డులను డిసెంబర్ 3 వరకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. వీటిని అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు.


పోస్టులెన్నయినా పరీక్షలు ఒకేసారి...
గతంలో ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీ పడితే ఆన్నిసార్లు ఫిజికల్ ఈవెంట్లు వేర్వేరుగా నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఎన్ని పోస్టులకు పోటీపడినా ఒకసారి అర్హత సాధిస్తే సరిపోయేలా కీలక మార్పులు చేశారు. ఒకసారి అర్హత సాధించగలిగితే ఆ ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు మండలి ప్రకటించింది.


12 మైదానాల్లో ఈవెంట్లు...


హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మరో ఒకటి రెండు కొత్త ప్రదేశాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 


🔰 హైదరాబాద్- ఎస్ఏఆర్‌సీపీఎల్ - అంబర్‌పేట


🔰 సైబరాబాద్- 8వ బెటాలియన్ కొండాపూర్


🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం


🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం


🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం


🔰 కరీంనగర్- సిటీపోలీస్ శిక్షణ కేంద్రం


🔰 ఆదిలాబాద్- పోలీస్ పరేడ్‌ గ్రౌండ్


🔰 నిజామాబాద్ రాజారాం స్టేడియం, నాగారం(నిజామాబాద్)


🔰 మహబూబ్‌నగర్- డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్


🔰 వరంగల్- హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం


🔰 ఖమ్మం- పోలీస్ పరేడ్ గ్రౌండ్


🔰 నల్గొండ- మేకల అభినవ్ స్టేడియం


ఈవెంట్లు ఇలా..
🔰 ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది.


🔰పరుగుపందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు.


🔰 వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.


🔰 ఫిట్‌నెస్ టెస్ట్‌లో ప్రతి అభ్యర్థి ఛాతీ, ఎత్తు, బరువును నమోదుచేస్తారు. 


త్వరలో అడ్మిట్ కార్డు...
ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డు ఉంటేనే ఫిజికల్ ఈవెంట్లకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈవెంట్లకు హాజరయ్యే వారు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.


ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్య సూచనలు...


✦ అభ్యర్థి సంతకంతో కూడిన పార్ట్-2 ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు ఫిజికల్ ఈవెంట్ అడ్మిట్ కార్డు వెంట తీసుకురావాలి.


✦ స్వయంగా ధ్రువీకరించకున్న, కమ్యూనిటీ సర్టిఫికెట్ కాపీలను కచ్చితంగా వెంటతీసుకురావాలి.


✦ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కాపీ తీసుకురావాల్సి ఉంటుంది.


✦ ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి.


✦ అభ్యర్థులు తమకు కేటాయించిన గ్రౌండ్‌లో ఉదయం 4 నుంచి 5 గంటల లోపు ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఆలస్యమైన వారికి అనుమతి ఉండదు.

✦ అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి.


రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.


ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం ఇలా..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో మొత్తం 41.67 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.





Also Read:


 ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్లపై బోర్డు కీలక అప్‌డేట్! వీటిని సిద్ధం చేసుకోండి!


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...