తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులైన బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్ నియామకం పరిశీలించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 


టీఎస్‌పీఎస్సీ సభ్యలు నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం (జూన్ 16) హైకోర్టులో విచారణ జరిగింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021 మే 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 18 జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ నిబంధనల మేరకు ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలు లేవని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలను తాజాగా హైకోర్టు పరిశీలించాలని పిటిషనర్ కోరారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఆరుగురు సభ్యుల నియామకం మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలు పరిశీలించాలని, 3 నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని సూచించింది.


ఆరుగురి నియామకం ప్రభుత్వ తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.


Also Read:


గురుకులాల్లో 9,210 పోస్టుల పరీక్ష తేదీలు ఖరారు! ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణలోని గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను గురుకుల విద్యాలయాల సంస్థ ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూలును ఒకట్రెండుల్లో వెల్లడించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు కన్వీనర్ డా. మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో మొత్తం 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 2.63 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల పోస్టుల దరఖాస్తుల సవరణ, ఈ తేదీల్లోనే అవ‌కాశం!
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో 9,231 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసిందే. అర్హత గ‌ల అభ్యర్థుల నుంచి ఇప్పటికే ద‌ర‌ఖాస్తులు స్వీకరించారు. అయితే అభ్య‌ర్థుల‌కు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది గురుకుల నియామ‌క బోర్డు. అభ్య‌ర్థులు ఒకసారి మాత్రమే త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఎడిట్ చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ప్రింట్ తీసుకుని భ‌ద్ర‌ప‌రుచుకోవాని సూచించారు.
దరఖాస్తుల సవరణ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..