TS Gurukula Posts Merit List: తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. హైకోర్టు నుంచి స్పష్టత రావడంతో.. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటించింది. ప్రస్తుతానికి గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా 1:2 నిష్పత్తితో జాబితాను బోర్డు ప్రకటించింది. పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు గురువారం (ఫిబ్రవరి 8) మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక జాబితాను వెల్లడించనుంది. ఫలితాల వెల్లడి నుంచి నియామక పత్రాల అందజేత వరకు దాదాపు మూడు నెలలకు పైగా సమయం పట్టవచ్చు. ఈ విద్యాసంవత్సరంలోగా నియామకాలు పూర్తిచేసి, పోస్టింగులు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.


గురుకుల పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..


Website


మహిళలకు సమాంతర రిజర్వేషన్లు..
గురుకుల పోస్టులకు సంబంధించి ఖాళీల నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది. అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా న్యాయ వివాదం ముగియడం, ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీచేయడంతో గురుకుల నియామక ఫలితాలను గురుకుల బోర్డు వెల్లడించింది. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను ప్రకటించింది. 


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్..!
అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన రోజు, కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకుని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యాసంస్థల్లో ప్రవేశాల సందర్భంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభానికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి.


సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకిగానూ బోర్డు గతేడాది ఒకేసారి తొమ్మిది నియామక ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతేడాది ఆగస్టులో నెలరోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు.. వెనువెంటనే ప్రాథమిక, తుది కీలను వెల్లడించింది. అప్పుడే ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ.. సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో జాప్యం జరిగింది. ఈ వివాదాలు మంగళవారంతో ముగియడంతో మెరిట్‌ జాబితాలను బోర్డు వెల్లడించింది. మరోవైపు వేగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్‌లోని కొన్ని పోస్టులకు ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే గురుకుల సిబ్బంది, ఇతర విభాగాల అధికారులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనపై అవగాహన తరగతులు పూర్తిచేసింది.


డెమో తరగతుల తర్వాత కొన్నింటికి..
లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తిచేయాల్సి ఉంది. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో పూర్తిచేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ వేగంగా మూడు రోజుల్లోనే పూర్తిచేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించింది. ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫిబ్రవరి 14న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తోంది.


రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.


గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడుషిప్టుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామకబోర్డు నిర్వహించింది. వీటికి సగటున 75.68 శాతం మంది హాజరయ్యారు. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు సిద్ధం చేసింది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...