TGPSC Recruitment 2026: తెలంగాణ ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ పట్టభద్రులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్లు, భవనాల శాఖతోపాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 290 పోస్టులతో విడుదలైన ఈ నోటిఫికేషన్లు, నిరుద్యోగ యువతలో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడు ప్రధాన విభాగాల్లో ఖాళీలను భర్తీ
ఆర్ అండ్ బీ శాఖలో అత్యధికంగా 222 AEE(సివిల్) ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ శాఖలోనే 49 AEE(ఎలక్ట్రికల్) ఖాళీలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ భర్తీ చేయనుంది.
మొత్తం 290 పోస్టులకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల ఎంపికైన వారికి 54, 220 నుంచి 1,33,630 వరకు భారీ వేతన శ్రేణి లభిస్తుంది.
ప్రభుత్వం గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం ద్వారా పదేళ్ల సడలింపు ఇవ్వడంతో సీనియర్ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశంగా మారింది.
ప్రతి విభాగం ద్వారా దరఖాస్తులు వేర్వేరు తేదీల్లో ప్రారంభమవుతాయి. అభ్యర్థులు కమిషన్ సూచించిన షెడ్యూల్ ప్రకారం అప్లై చేయాలి.
| పోస్ట్ పేరు | దరఖాస్తు ప్రారంభం | చివరి తేదీ |
| ఏఈఈ(సివిల్) R&B | 06/06/2026 | 13/07/2026 |
| ఏఈఈ(ఎలక్ట్రికల్) R&B | 08/06/2026 | 15/07/2026 |
| అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ | 10/06/2026 | 17/06/2026 |
ఈ పోస్టులకు రాత పరీక్షలు తాత్కాలికంగా అక్టోబర్ 2026లో నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. హాల్ టికెట్లను పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు తమ విద్యార్హతలను, వయసును సరిచూసుకోవాలి.
- సివిల్ ఏఈఈ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
- ఎలక్ట్రికల్ ఏఈఈ:- సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
- ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్:- నోటిఫికేషన్ పేర్కొన్న పర్యావరణ విభాగాల్లో విద్యార్హతలు అవసరం
- డిస్టెన్స్ విధానంలో డిగ్రీ పొందిన వారు UGC/ AICTE గుర్తింపును కలిగి ఉండటం తప్పనిసరి.
- వయోపరిమితి:- 01/07/2026 నాటికి అభ్యర్థి వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానం విధానంలో ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు అనుసరించాల్సిన దశలు ఉన్నాయి.
- ముందుగా టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకోని వారు ముందుగా OTR(వన్ టైమ్ రిజిస్ట్రేషన్) పూర్తి చేసుకోవాలి. దీని ద్వారా యూజర్ ఐడీ పొందుతారు.
- కమిషన్ వెబ్సైట్(www.tgpsc.gov.in) సందర్శించి, మీ ఓటీఆర్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
- నోటిఫికేషన్లోని నిబంధనలను పూర్తిగా చదివి, మీ వివరాలను సరిచూసుకున్న తర్వాతే దరఖాస్తును సమర్పించాలి.
- పరీక్ష అబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇది ఓఎంఆర్ ఆధారితంగా లేదా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఉండొచ్చు. వివిధ సెషన్స్లో పరీక్ష నిర్వహిస్తే నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా మార్కులు లెక్కిస్తారు.
అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, దరఖాస్తు గడువు ముగియడానికి ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.
