TG TET Results 2025: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేల మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలను, అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉపాధ్యాయ నియామకాల్లో కీలకమైన ఈ పరీక్షా ఫలితాల కోసం అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Continues below advertisement

ఫలితాలు ఎలా చూసుకోవాలి? 

టెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌  https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/లో చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి తమ మార్కులను జాబితాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఈ ఏడాది నిర్వహించిన టెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,37, 754 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,95, 181 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 82 శాతం మంది అభ్యర్థులు తమ అధృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ లెక్కలు చూస్తే గతంతో పోలిస్తే అభ్యర్థుల హాజరు శాతం పెరిగిందని విద్యాశాఖ చెబుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువు సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. 

Continues below advertisement

ఈసారి టెట్‌ పరీక్షలో ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సర్వీస్ టీచర్స్ కూడా హాజరయ్యారు. ఇన్‌సర్వీస్‌లో ఉన్న వాళ్లకి కూడా టెట్ తప్పనిసరి చేయడంలో వాళ్లంతా పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇన్‌సర్వీస్ టీచర్లు రికార్డుల స్థాయిలో 90 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 

టెట్ పరీక్షలు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 20న ముగిశాయి. పరీక్షలు ముగిసిన తర్వాత ఫలితాలు విడుదల కూడా ఫిబ్రవరి 10- 16 మధ్య విడుదల చేయాలని అధికారులు ముందుగానే నిర్ణయించారు. ఆ లెక్క ప్రకారం పదో తేదీనే ఫలితాలు ప్రకటించారు. 

టెట్ అర్హత ప్రాధాన్యం ఇదే 

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయాలంటే టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కలకు ఉపాధ్యాయ నియామకాల్లో ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి కేవలం అర్హత సాధించడమే కాకుండా, మెరుగైన స్కోరు సాధించడం అభ్యర్థుల భవిష్యత్‌కు అత్యంత కీలకం. 

ప్రస్తుతం విడుదలైన ఫలితాలు ఆధారంగా అర్హత సాధించిన వారు తదుపరి వచ్చే ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ల కోసం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఫలితాల్లో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే లేదా మార్కుల విషయంోల సందేహాలు ఉంటే అభ్యర్థులు విద్యాశాఖ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు.