తెలంగాణలో శుక్రవారం (జనవరి 27) నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం (జనవరి 26న) ఉత్తర్వులు (జీవో నంబ‌ర్ 5) జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. జనవరి 27న కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. జనవరి 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించునున్నారు.


ఉపాధ్యాయులు తమ దరఖాస్తుల హార్డ్‌ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్​ఈవోలకు హార్డ్‌కాపీలను సమర్పించాలి. ఇక మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు సమర్పించాలి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2లోపు ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోనే అప్పీళ్లను పరిష్కరించనున్నారు.


2018లో టీచర్ల బదిలీలు, నాలుగేళ్ల తరువాత తొలిసారి..
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. జనవరి 28 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఈ మేరకు అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బదిలీలు, పదోన్నతుల పూర్తి షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టనున్నారు. అనంతరం హెచ్‌ఎం ఖాళీలను స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ ఫర్ చేస్తారు.  సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 2015 జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. మరోసారి 2018లో టీచర్ల బదిలీలు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. 


నాలుగున్నరేళ్ల తర్వాత బదిలీలు, పదోన్నతులకు ఓకే చెప్పింది. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది టీచర్లు అర్హత సాధిస్తారు. గత నిబంధనల ప్రకారం ఒకచోట ఉపాధ్యాయుడు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయుడు 5 ఏళ్లు మించి ఒకే చోట పనిచేయకూడదు. ఈ గరిష్ట సర్వీసుని పరిగణలోకి తీసుకొని అధికారులు బదిలీలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించింది ప్రభుత్వం. ఈ సమయంలో టీచర్లను కూడా ట్రాన్స్ ఫర్ చేసింది. సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చి ఈ ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ విధానంపై  అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా కొత్త జిల్లాల కేటాయింపులు జరగడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత ప్రాంతాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఉపాధ్యాయులుగా ఉన్న భార్యాభర్తలను చెరో జిల్లాకు కేటాయించడంతో అప్పట్లో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు.


మూడేళ్ల మినహాయింపు!  
అయితే పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్‌ మాత్రమే ఉన్నవారిని ఈసారి బదిలీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండేళ్ల సర్వీస్‌ ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో ఈసారి మూడేళ్ల సర్వీస్‌ మిగిలి ఉన్నా బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా, పదోన్నతులను ఆఫ్‌లైన్‌లో నిర్వహించేవారు. అయితే ఈసారి పదోన్నతులను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.  


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..